ఐదేళ్లలో రంగారెడ్డి, భీమా, కోయిల్సాగర్ పనులు పూర్తి
డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి ఉత్తమ్ల ప్రకటన
నారాయణపేట, ప్రజాతంత్ర, మార్చి 13 : మక్తల్ నుంచి వొచ్చే అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం నారాయణ పేట జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. మక్తల్ మండలం సంగంబండ ప్రాజెక్టును మంత్రులు పరిశీలించారు. ప్రాజెక్టు లోలెవల్ కెనాల్ కాల్వ తవ్వకానికి అడ్డంకిపై ఆరా తీశారు. 400 విూటర్ల బండను మంత్రులు భట్టి, ఉత్తమ పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ…కనీవినీ ఎరుగని రీతిలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని, ఐదేళ్లలో పాలమూరు రంగారెడ్డి, భీమా, కోయల్సాగర్ పనులను పూర్తి చేస్తామని హావిూ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా పైసల కోసమే ప్రాజెక్టులు కట్టారని వారు ధ్వజమెత్తారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తామని, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. వంశీచందర్ రెడ్డి ఎంపి అయితే పాలమూరు మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. పాలమూరు ప్రజల జీవితాల్లో ఆయన వెలుగులు నింపుతారని తెలిపారు. సంగంబండ శివాలయం, అంజనేయ స్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు.




