హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించిన వార్తలు జాతీయ విడియాలో తెరపైకి వొస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వొచ్చింది.
తెలంగాణ సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరామ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..అక్టోబర్ 8 లేదా 10 తేదీల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఇక నవంబర్ రెండో వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 10 నుంచి 15 మధ్య వోట్ల లెక్కింపు ఉంటుంది. అయితే, దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.





