ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా డా॥ జి చిన్నారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ ర్యాంకుతో ఆయన నియామకం తక్షణమే అమలులోకి రానున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇక విద్యాధికుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన చిన్నారెడ్డి గతంలో నాలుగు సార్లు వనపర్తి శాసన సభ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. పార్టీలోనూ పలు కీలక పదవులలో పని చేశారు. ప్రస్తుతం ఆయన ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారు. నిబద్ధత కలిగిన నాయకుడిగా చిన్నా రెడ్డి గుర్తింపు పొందారు.




