- బంగారు తెలంగాణ కాదు..బంగారు కుటుంబం చేసుకున్నారు
- ముస్లిమ్ మైనార్టీ వోట్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసి సంతోష పెడుతున్నారు.
- ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పైసలను దారి మళ్లిస్తున్నారు.
- అర్హులైన లబ్ధిదారులకు ఇంకా దళిత బంధు చేరలేదు
- కేంద్ర మంత్రి భగవంతు కుభ
మహబూబ్నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తుందని భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర రసాయన ఔషధ కొత్త పాత పునరుత్పత్తుల శాఖ సహాయ మంత్రి భగవంతు ఖుభ అన్నారు. గురువారం జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్, కాంగ్రెస్ రాజనీతి ఒకటేనని, కుటుంబ అభివృద్ధి వాటి లక్ష్యమని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఏమాత్రం వారికి పట్టదని ఆయన విమర్శించారు. పది సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బిఆర్ఎస్ మరోసారి ఉచితాల పేరుతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు . తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను, ఉద్యమంలో పాల్గొన్న యువతను, ఉద్యమకారులను బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందన్నారు.
బంగారు తెలంగాణ కాలేదు కానీ..ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు సైతం ఇవ్వడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళిత బంధు పేరు చెప్పి అర్హులైన దళితులకు దళిత బంధు ఇప్పటివరకు ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల నాయకులను తాను ఒక్కటే కోరుతున్నాని, దళిత ద్రోహి కేసీఆర్ గురించి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా దళిత సామాజిక వర్గాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అధికారమే లక్ష్యంగా ఐదు గ్యారంటీ ఉచిత పథకాల పేరు చెప్పుకుని కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వొచ్చిందన్నారు. ఐదు నెలలు అయినా వారు ఇచ్చిన ఐదు గ్యారంటీ హామీలు అమలు చేయడం లేదని అన్నారు.
అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ముస్లిం సమాజం వోట్ల కోసం తెలంగాణ ప్రజల సొమ్మును వారికి ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉన్న మంత్రులలో అత్యంత అవినీతి మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది పాలమూరు మంత్రి పేరు వొస్తుందని అన్నారు. ప్రజల కోసం పనిచేసే నరేంద్ర మోదీ నాయకత్వంలోని అవినీతి రహిత పాలన తెలంగాణ సమాజం కోరుకుంటుందని కేంద్ర మంత్రి అన్నారు. అలాంటి నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి పద్మజా రెడ్డి, ఎగ్గని నర్సింలు, పార్లమెంట్ కన్వీనర్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షులు క్రిస్టియ నాయక్, కృష్ణ వర్ధన్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఎస్ పాండురంగారెడ్డి; పాలమూరు అసెంబ్లీ కన్వీనర్ విఎల్ఎన్ రాజు రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచ్చుగట్ల అంజయ్య, నాయకులు బురుజు రాజేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణయ్య, బుచ్చిరెడ్డి, జామ్ శ్రీనివాసులు, కందూరు రమేష్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.





