- ఇప్పుడు పేరు బంధం కూడా తెంచుకున్నారు
- బిఆర్ఎస్ ఆవిర్భావంపై రేవంత్ విమర్శ
- మోదీని దిల్లీ ప్రజలే ఛీత్కరించారు : సోనియా బర్త్డే వేడుకల్లో పిసిసి చీఫ్ రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని, టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారడంతో పేరు బంధం కూడా లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్గా మార్చడంపై ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు చెప్పాలని అడిగిందని, అయితే తాను సీఈసీని కలిసేందుకు వెళ్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని రేవంత్ వాపోయారు. పీసీసీ చీఫ్, ఎంపీగా ఉన్న తనను కలిసేందుకు సీఈఓకు వీలుపడలేదని విమర్శించారు. దిల్లీ హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి బీఆర్ఎస్గా మార్చిందని, కేసు పెండింగ్లో ఉన్నందున పేరు మార్చేందుకు వీల్లేదని అన్నారు.
ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని రేవంత్ స్పష్టం చేశారు. వోట్లను చీల్చేందుకే బీజేపీ టీఆర్ఎస్ను వాడుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలపై, బంగారు కూలీపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బంగారు కూలీ పేరుతో వందల కోట్లు వసూల్ చేసిన పార్టీ ఆ లెక్కలు ఎక్కడా చూపించలేదని అన్నారు. దీనిపై అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసీఆర్ ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాలను కలిపే విషయంలో గురువారం సజ్జల మాట్లాడిన మాటల్ని తేలికగా తీసుకోవద్దని చెప్పారు. సజ్జల కామెంట్స్ను టీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించలేదంటేనే అర్థం చేసుకోవాలని అన్నారు. సజ్జల మాటల వెనుక కేసీఆర్ ప్రమేయం ఉందని విమర్శించారు. ఏపీ, తెలంగాణ తిరిగి కలిసిపోతే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
మోదీని దిల్లీ ప్రజలే ఛీత్కరించారు : సోనియా బర్త్డే వేడుకల్లో పిసిసి చీఫ్ రేవంత్
ప్రధాని నరేంద్రమోదీని దిల్లీ ప్రజలే వద్దనుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే దిల్లీ మున్సిపాలిటీలో ఓటమి పాలైందని చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ మున్సిపాలిటీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నిక జరిగితే గుజరాత్ తప్ప అన్ని చోట్ల బీజేపీ ఓడిపోయిందని అన్నారు. అయినా అన్నింట్లో గెలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా వోటేసి కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని రేవంత్ చెప్పారు. అయితే బీజేపీ అనుకూల వి•డియా మాత్రం కాంగ్రెస్ గెలుపును చిన్నది చేసి చూపే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ మెగా రక్తదాన శిబిరం, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రేవంత్ చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాద బీమా ఇస్తున్నామన్న ఆయన.. ఇవాళ 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావేత్తో పాటు మాజీ మంత్రులు, ఇతర నేతలు సోనియా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. హాస్పిటళ్లకు వెళ్లి చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయగా.. పలు చోట్ల వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వారికి తమ వంతు సేవలు అందించారు.
ఇంకొన్ని చోట్ల అన్నదాన, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి ప్రారంభించారు. రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలను రేవంత్ రెడ్డి అభినందించారు.



