తిరుమలలో కొనసాగుతున్న రద్దీ సర్వదర్శనానికి 20గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,263 మంది భక్తులు దర్శించుకోగా 28,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 20 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయని, చివరిరోజున భక్తులు విశేషంగా విచ్చేసే పంచమి తీర్థానికి పటిష్టంగా ఏర్పాట్లు చేపడుతున్నామని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

ఈ సందర్భంగా తిరుమల నుంచి వచ్చే సారె ఊరేగింపు రూట్‌మ్యాప్‌ను పరిశీలించి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుని, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఈ ఊరేగింపులో ఏనుగులు బెదరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులు వేచి ఉండేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని, అక్కడ అన్నప్రసాదాలు, తాగునీరు, అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *