సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 29: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం సందర్శించారు.సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక
అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు, నారాయణఖేడ్ నియోజకవర్గం నకు సంబందించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేపట్టిన ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరు తెన్నులను కలెక్టర్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఏ.పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఈవీఎం ల పనితీరును ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది సరిచేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తేవాలని ఆర్.ఓలకు సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోకలెక్టర్ వెంటా ఎస్పీ రూపేష్ , జనరల్ అబ్జర్వర్ పవన్ కుమార్, పోలీస్ అబ్జర్వర్ దయాల్ గంగ్వార్, నియోజకవర్గ ఆర్వో రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.నారాయణఖేడ్ నియోజకవర్గంలో కలెక్టర్ వెంటా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు దీపక్ సింగ్లా, నారాయణఖేడ్ రిటర్నింగ్ అధికారి వెంకటేష్, తదితరులు ఉన్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్





