పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చ
న్యూ దిల్లీ, జూలై 26 : నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు రెండోసారి హాజరైన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహా అన్ని సంస్థలనూ దుర్వినియోగం చేస్తుందని, కేంద్రానిది నిరంకుశ వైఖరని రాహుల్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలందరినీ దిల్లీ పోలీసులు కింగ్స్వే పోలీస్ డిటెన్షన్ క్యాంపునకు తరలించారు. దీంతో రాహుల్ కాంగ్రెస్ నేతలతో అక్కడే మేథోమథనం నిర్వహించారు. ధరల పెరుగుదల, అగ్నిపథ్, ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపు, జాతీయ భద్రత, రూపాయి పతనం తదితర అంశాలపై అక్కడ చర్చించారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధరి, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర నేతలంతా ఈ మేథోమథనంలో పాల్గొన్నారు. వాస్తవానికి కొరోనా అనంతర ఇబ్బందులతో బాధపడుతున్న సోనియాను 4 రోజుల క్రితం రెండు గంటలు మాత్రమే ప్రశ్నించారు. వాంగ్మూలం నమోదు చేసుకుని పంపేశారు. ఈడీ సమన్లతో ఆమె మళ్లీ మంగళవారం హాజరయ్యారు.




