నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్ ఏఐ యుగం వరకు మానవాళి జీవితంలో ఎన్నో మార్పులు, ఎంతో విప్లవాత్మక పరిణామక్రమ సజీవ చరిత్రగా నిక్షిప్తమైంది. కుటుంబానికి రేడియో విలాసవంతమైన ఉపకరణమైన గతం నుంచి నేడు ప్రతి ఇంట్లో స్మార్ట్ టివీ మోగుతోంది. ట్రంక్కాల్ వసతి నుంచి ప్రతి చిట్టి పొట్టి చేతిల్లో కూడా స్మార్ట్ ఫోన్ కూర్చొంది. మానవ రహిత ఆఫీసు నడిపించే మర మనిషి రోబో రూపంలో నిలబడ్డాడు. క్షణాల్లో సమాచార వితరణకు సామాజిక మాద్యమ వేదికలు అందుబాటులోకి వచ్చాయి. దూరాలు చెరిపేస్తున్న వీడియో కాల్ వసతి మన సొంతమైంది. గాల్లో ఎగిరే విమానాన్ని చూసి కేరింతలు కొడుతూ అపూర్వ అనుభవంగా మనసుల్లో దాచుకున్న రోజుల నుంచి సామాన్యుడు విమానయానం చేసే స్థాయి ఏర్పడింది. అరచేతిలో స్మార్ట్ఫోన్ రూపంలో వైకుంఠం వెలసింది. శాస్త్రసాంకేతిక విప్లవంతో ప్రపంచమే కుగ్రామం అయ్యింది.
జీవనశైలిలో సమూల మార్పులు: మానవాళి జీవనశైలిని సమూలంగా మార్చి వేసిన నవ్య ఉపకరణాల్లో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టివీలు, ల్యాబ్ ట్యాబ్స్, పిసీలు, కంప్యూటర్స్, సామాజిక మాధ్యమాలు, రోబోటిక్స్, క్లౌడ్-ఆధారిత వ్యవస్థలు, కృత్రిమ మేధ, ఐఓటీ లాంటి నవ్య సాంకేతిక ఫలాలు మార్కెట్ను ముంచేస్తున్నాయి. సామాజిక ఆర్థిక ప్రగతి, ఉత్పత్తుల పెరుగుదల, కనెక్టివిటీ ఊహకందనంత పెరిగి పోయింది. నేటి డిజిటల్ విప్లవం అత్యంత వేగంగా, తీవ్రంగా విస్తరిస్తోంది. గత కొన్ని దశాబ్దాల్లో పిసీల స్టోరేజ్ కెపాసిటీ, ఉపకరణ సైజ్ల్లో అనేక రెట్లు మార్పులు చూస్తున్నాం. మూడు దశాబ్దాల క్రితం గ్లోబల్ ఐపి ట్రాఫిక్ రోజుకు 100 జీబీ ఉండగా, నేడు సెకనుకు 1.5 లక్షల జీబీలకు చేరడం జరిగింది.
ఖనిజ వనరుల దోపిడి : డిజిటల్ ఉపకరణాల ఉత్పత్తికి సంబంధించిన కాలుష్యాన్ని డిజిటల్ పొల్యూషన్గా పిలుస్తారు. డిజిటల్ విప్లవం వేదికపైన కనిపిస్తున్న వెలుగులను చూస్తున్న మానవాళి తెర వెనుక దాగి ఉన్న దుష్ప్రభావాలు రాబోయే తరాలకు శాపాలుగా మారనున్నాయని మరిచి పోతున్నాం. వ్యక్తులు, సంస్థలు, సామాజిక వ్యవస్థలు పలు వికృత రూపాలను చూడనున్నాయి. డిజిటల్ పరిశ్రమతో అస్థిరాభివృద్ధి, పర్యావరణ విచ్ఛిన్నత పెనవేసుకున్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఉపకరణాల తయారీలో అరుదైన ఖనిజ లోహాలు, ఖరీదైన కోబాల్ట్ లాంటి లోహాలు విచ్చలవిడిగా వాడడుతున్నాం. ఈ క్రమంలో పర్యావరణానికి హాని చేయగల హెవీ మెటల్స్, రోడియోధార్మిక పదార్థాలను విసర్జించడంతో భవిష్యత్తు ఎంతో ప్రమాదకర అనుభవాలను రుచి చూడనున్నాం. డిజిటన్ మౌళిక సదుపాయాల కల్పనకు అపార శక్తి వినియోగం, కార్బన్ ఉద్గారాలు పెరగడం, భూతాపం లాంటి ప్రతికూలతలు దాగి ఉన్నాయి. ఈ-వ్యర్థాలు (ఎలక్ట్రానిక్ వేస్ట్): ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 300 మిలియన్ల డిజిటల్ ఉపకరణాలు, 1 బిలియన్ మొబైల్ ఫోన్లు తయారు అవుతున్నాయని అంచనా. ఇంటర్నెట్ విస్తార వినియోగంతో నేడు 4 శాతం ఉన్న గ్లోబల్ ఎమిషన్స్ 2040 నాటికి 14 శాతం వరకు చేరవచ్చు. డిజిటలైజేషన్ పుణ్యాన ప్రమాదకరమైన ఈ-వ్యర్థాలు (ఎలక్ట్రానిక్ వేస్ట్) పర్యావరణంలోకి చేరి ప్రమాదకర కాలుష్యాలుగా నిలుస్తున్నాయి.
నిరంతరం నీలి తెరలను అతుక్కొని ఉంటున్న యువత కంటి జబ్బులు, మానసిక ఒత్తిడి, వ్యసనం, ఒంటరితనం, ఉద్రేకం లాంటి లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. నవ్యత వైపుకు డిజిటల్ అడుగులు పడుతున్న వేళ సుస్థిరాభివృద్ధి దిశగా, గ్రీన్ వ్యవస్థల స్థాపనలు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ప్రయాసపడని యెడల డిజిటల్ విప్లవం కాలుష్య విస్తరణ కేంద్రంగా మారుతుందని గమనిస్తూ, సుస్థిరాభివృద్ధి వైపుకు పటిష్ట అడుగులు వేద్దాం. స్మార్ట్ డిజిటల్ ఆలోచనలతో స్వచ్చతకు పట్టం కడదాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037




