‘‘వ్యాధి వచ్చినప్పటి కంటే రాకుండా తీసుకోనే జాగ్రత్తలే మేలని ముందుగా ‘‘వ్యాక్సి నేషన్’’ ద్వారా వ్యాధులను రాకుండా ముందుగానే కట్టడి చేయవచ్చని సూచించాడు. అంతేకాదు వ్యాధి సోకినా దానిని నియంత్రించి, రూపుమాపే మందులను కూడా కనుగొనేందుకు మార్గం చూపించాడు.’’
- రోగకారక క్రిమి సిద్ధాంతకర్త పాశ్చర్
- నేడు ఆంటీ రేబీస్ టీకా తొలి సారి వాడిన దినం
టీకాల ఆవిష్కారానికి ఆద్యుడు లూయీ పాశ్చర్. మొదటి సారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారు చేశాడు. లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా 1885 జూలై 6న వాడాడు.
ఆంత్రాక్స్, రబీస్ తదితర వ్యాధు లకు మందులను కనిపెట్టడంలో మూలపురుషుడై అవిరళ కృషి సల్పిన సూక్ష్మజీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్. 19 వ శతాబ్దంలో గాలి సోకడం వల్ల అంటువ్యాధులు వస్తాయని నమ్మేవారు. గాలిలో రోగకారక క్రిములని మోసుకొచ్చే వస్తువుల వల్ల అంటు వ్యాధులు కలుగు తాయని అప్పుడు ఎవరికీ తెలీదు. సొంత కుంటుంబంలో జరిగిన విషాద సంఘటనలు, పాశ్చర్ తన పరిశోధనలను కలరా, మశూచి వ్యాధులకు మూలమైన వ్యాధి కారకాలను కనుగొనే దిశలో కొనసాగేట్లు చేశాయి.
నేడు మనం చిన్న పిల్లలకు కలరా, మశూచి, పోలియో రాకుండా ముందుగానే వేయిస్తున్న ‘టీకాలు’ ఆ మహానుభావుని ఆలోచనే. వ్యాధి వచ్చినప్పటి కంటే రాకుండా తీసుకోనే జాగ్రత్తలే మేలని ముందుగా ‘‘వ్యాక్సి నేషన్’’ ద్వారా వ్యాధులను రాకుండా ముందుగానే కట్టడి చేయవచ్చని సూచించాడు. అంతేకాదు వ్యాధి సోకినా దానిని నియంత్రించి, రూపుమాపే మందులను కూడా కనుగొనేందుకు మార్గం చూపించాడు.పాశ్చర్ తన ప్రయోగాలను ఉపయోగించి సూక్ష్మజీవులు వాస్తవానికి ఇతర సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తి అవుతాయని, ఊరికే గాలిలోంచి ఊడిపడవని నిరూపించారు. నేడు లక్షలాది అంటు రోగాలను తగ్గించేందుకు మన ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో మందులున్నాయి. దానికి ఎంతో కృషి సల్పిన, నేటికీ నిత్యం శ్రమిస్తున్న ఎంతో మంది సూక్ష్మ జీవశాస్త్రవేత్తలకు లూయీ పాశ్చర్ వంటి వారు ఏర్పరిచిన శాస్త్రీయ విధానమే మూలాధారం.
లూయీ పాశ్చర్ (డిసెంబరు 27, 1822 – సెప్టెంబరు 28, 1895) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణం సూక్ష్మ క్రిములను కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు.
టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటి సారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారు చేశాడు. రాబర్ట్ కోచ్, ఫెర్డినాండ్ కాన్తో పాటు జీవశాస్త్ర వ్యవస్థాపక త్రయంలో ఒకరు. పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశ పెట్టిన వ్యక్తిగా సుపరిచితుడు. ఈ పద్ధతిని నేడు ‘‘పాశ్చరైజేషన్’’ అంటారు. కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణా లన్న విషయాన్ని నిరూపించాడు. పాశ్చర్ కొన్ని అద్భుత ప్రయోగాలు చేసి సూక్ష్మ జీవులు ఒకదాన్నుండి ఒకటి పుడతాయని, గాల్లోంచి ఊడి పడవని నిరూపించాడు. ఆయన ప్రతిపాదించిన రోగకారక క్రిమి సిద్ధాంతం (Germ theory of disease)) వైద్య శాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన భావనగా చెప్పు కోవచ్చు. అంతేకాక ఆయన వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రులలో చేతులు కడుక్కోవ డం వంటి పరిశుభ్రతా పరమైన పద్ధతులు ప్రవేశ పెట్టాడు. పాశ్చర్ అత్యంత సునిశితమైన, క్రమబధ్ధ మైన ప్రయోగాలు చేసి ఎన్నో ప్రమాద కరమైన సూక్ష్మజీవులను కనుగొన్నాడు. ఆ సూక్ష్మజీవులని అరికట్టే వాక్సీన్ లు రూపొందించి మనుషులనే కాక, జంతువులను కూడా ఎన్నో భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడాడు.
పాశ్చర్ 1822 సంవత్సరం డిసెంబరు 27న ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో జన్మించాడు. పాశ్చర్ పాఠశాలకు వెళ్ళకుండా కొంతవరకు విద్యావంతుడయ్యాడు. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవాడు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేశాడు. గణితం, భౌతిక, రసాయ నిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలను కొనేవాడు. పదహారేళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగు పెట్టాడు. డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితు డైనాడు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కూతురు మేరీ లారెంట్ ను పెళ్ళిచేసుకోగా, అయిదుగురు పిల్లలు పుట్టినా, టైఫాయిడ్ వల్ల ఇద్దరు, మశూచి వల్ల ఒకరు, ముగ్గురు మరణించారు.
పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయ నం చేసి ‘‘స్టీరియో కెమిస్ట్రీ’’ అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించాడు. తరువాత తన పరిశోధనలను పులియడం (ఫెర్మెంటేషన్ ) వంటి అంశాలపై కొనసాగించి సూక్ష్మక్రిములపై అనాదిగా ఉన్న భావాలను ఖండించి కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. ద్రక్షసారా (వైన్) వల్ల వచ్చే వ్యాధులు, నిల్వచేసే పద్ధతులు, వెనిగర్ తయారీ మొదలైన అనేక అంశాలపై కొత్త విషయాలు కనుగొన్నాడు. రేబీస్ అనేది వైరస్ ల వల్ల కలిగే ఓ భయంకరమైన వ్యాధి. అది కుక్కల నుండి మనుషులకి సోకుతుంది. ఈ వైరస్ బాక్టీరియాల కన్నా అతి చిన్నదైన వస్తువు. కనుక పాశ్చర్ వాడిన సూక్ష్మదర్శినిలో ఇది కనిపించ లేదు. ఆ వైరస్ వ్యాధితో కేంద్ర నాడీ వ్యవస్థ ఫై ప్రభావితం చేస్తుంది. పాశ్చర్ ఆ వ్యాధి సోకిన జంతువుల వెన్నుపాము నుంచి ద్రవం సంగ్రహించి, వివిధ పద్ధతుల చేత ఆ ద్రవం యొక్క రోగ తీవ్రతని క్షీణపరిచి, ఆ ద్రవాన్ని తిరిగి కుక్కల మీదకి ఎక్కించి రేబీస్ కి వాక్సీన్ ని రూపొందించాడు.
కోళ్లకు వచ్చే కలరా వంటి పారుడు వ్యాధిపై పరిశోధన జరిపి వ్యాధి కారకాలైన సూక్ష్మజీవులను బలహీనపరచి ఇతర కోళ్ళకు ఎక్కించి వాటిలో రోగనిరోధక శక్తి పెరిగి తర్వాత కాలంలో రోగం రాకుండా రక్షిస్తుందని నిర్ణయానికి వచ్చాడు. 1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మీద ప్రయో గించాడు. ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణా లన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనుషులు గాని, జంతువులు గాని అంటు వ్యాధితో మరణిస్తే ఆ శవాన్ని దహనం చేయాలని చెప్పాడు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించాడు. పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశాడు. సంకల్ప బలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. పాశ్చర్ సూక్ష్మ జీవ శాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందాడు. రెండు సార్లు గుండె పోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ 1895 సెప్టెంబరు 28న పరమ పదించాడు. లూయిస్ పాశ్చర్ జ్ఞాపకర్ధంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబరు 28న ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపు కుంటారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494




