టీఎస్‌పీఎస్‌సీ 547 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాలను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారి పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇవ్వగా.. 2023 మే, జూన్‌, జులై నెలల్లో కంప్యూటర్‌ ఆధారిత వ్రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల జనరల్‌ ర్యాంకు జాబితాలను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. ఫలితాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటించనున్నారు.

మరో వైపు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఇప్పటికే గురుకుల డిగ్రీ కాలేజీలు, గురుకుల జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ ఉద్యోగాలతోపాటు గురుకుల పాఠశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేశారు. మరో 7 వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు వేగవంతం చేసింది. ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీలలో ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేలా టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ కాలేజీల్లోని 793 లెక్చరర్‌ ఉద్యోగాలు, జూనియర్‌ కాలేజీల్లో 1924 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో వేర్వేరుగా ప్రాథమిక ఎంపిక జాబితాలను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ధృవపత్రాల పరిశీలన, అభ్యర్థులకు డెమో పరీక్షలను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *