- పబ్లిక్ నోటీస్ ఇచ్చిన కెసిఆర్
- ఇసి నిబంధనల మేరకు అభ్యంతరాలకు జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర : పేరు మార్పునకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తెలపాలని ఈ పబ్లిక్ నోటీస్ లో పేర్కొంది. పార్టీ ప్రెసిడెంట్ పేరుతో ఈ ప్రకటన వెలువడింది. ఈ ఏడాది అక్టోబర్ 5 దసరా పండుగ రోజున టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశామని స్పష్టం చేసింది. పార్టీ పేరు మార్పునకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ రాజ్యాంగంలో చేసిన సవరణలకు జనరల్ బాడీ సమావేశం ఆమోదం తెలిపింది. పార్టీ పేరు మార్పుపై టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. పార్టీ పేరును ’భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అధ్యక్షుడు కేసీఆర్ పేరిట జారీ అయిన ఈ ప్రకటనలో పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు.
అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలన ప్రకారం.. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాలి. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.




