హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతుతుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. దీంతో పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వొస్తున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాలకు వరద, మురుగునీరు ఇళ్లలోకి వొస్తుంది. ఆల్వాల్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్లలోకి వరద నీరు వొచ్చి చేరుతుంది. అంతేకాకుండా..వరద నీరుతో పాములు కూడా వొస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు పాములు, విష కీటకాలు వొస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. మరోవైపు తాజాగా ఈ విషయాన్ని అధికారులకు చెప్పడంతో ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఓపిక నశించి సంపత్ కుమార్ అనే వ్యక్తి వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు.
తన ఇంట్లోకి వొచ్చిన పాముతో ఆల్వాల్ జీహెచ్ఎంసీకి తీసుకొచ్చాడు. కార్యాలయంలోని ఓ టేబుల్ మీద పామును విడిచిపెట్టి వినూత్న నిరసన చేపట్టాడు. ఆ పామును చూసిన కార్యాలయం సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అల్వాల్ భారతినగర్లో ఓ పాడు పడ్డ ఇంట్లో చెట్ల పొదలు పెరిగి, పాములు వొస్తున్నాయి. దీంతో పక్కింటి వారు 15 రోజుల క్రితం అల్వాల్ వార్డు ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోవడంలేదని పాముతో సంపత్ అనే వ్యక్తి వార్డు ఆఫీసుకు చేరుకున్నాడు. ప్రైవేట్ ప్రాపర్టీ కావడంతో, చెట్ల పొదలను క్లీన్ చేసే అధికారం తమకు లేదనీ జిహెచ్ఎంసి అధికారులు తెలిపారు.
దీంతో జీహెచ్ఎంసీ ఆఫీసు నుండి పామును తీసుకెళ్లి దగ్గర్లోని చెరువులో వదిలేశారు. కాలనీ వాసులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో తాము అనుభవిస్తున్న బాధను అధికారులకు ప్రత్యేక్షంగా చూపించేందుకు వెళ్ళామని కాలనీ వాసులు అంటున్నారు. మరోవైపు పాముతో నిరసన తెలిపిన సంపత్పై జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు తమ పిల్లలు కాలనీలో ఆడుకోవాలంటేనే భయపడుతున్నారని తమ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.




ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే