- అనుకూలంగా 454 వోట్లు..వ్యతిరేకంగా రెండు వోట్లు
- వ్యతిరేకించిన ఇద్దరు ఎంఐఎం సభ్యులు
- మ్యాన్యువల్ పద్ధతిన వోటింగ్
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 20 : గత మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు లోక్ సభ ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా బుధవారం దీనిపై దాదాపు ఎనిమిది గంటల పాటు చర్చ జరిగిన అనంతరం న్యాయ శాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన అనంతరం మాన్యువల్గా వోటింగ్ నిర్వహించారు. వోటింగ్లో 454 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా వోటు వేయగా..ఇద్దరు వ్యతిరేకంగా వోటేశారు. దీంతో కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభలో ఆమోదం పొందిన మొదటి బిల్లుగా చారిత్రాత్మక మహిళా రిజర్వేన్ బిల్లు నిలిచిపోనుండగా లోక్ సభలో మొదటి సారిగా ఈ బిల్లు ఆమోదం పొందింది. గతంలో ఒకసారి రాజ్య సభలో ఆమోదం పొందినా ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం అభించ లేదు. ఇక ఈ బిల్లు ఆమోదం కొరకు రాజ్య సభ ముందుకు వెళ్లనుంది.

అక్కడ కూడా బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. కాగా డీలిమిటేషన్ తర్వాత 2029 ఎన్నికల సందర్భంగా మహిళా రిజర్వేషన్ కోటా అమలు కానుంది. ఆమోదం పొందడానికి ముందు మ్యాన్యువల్ పద్ధతిలో నిర్వహించిన వోటింగ్లో సభ్యులందరికీ ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను అందించి పక్రియపై లోక్ సభ జనరల్ సెక్రటరీ సభ్యులకు వివరించారు. బిల్లుకు మద్ధతు తెలుపడానికి ఆకుపచ్చ స్లిప్పుపై ‘ఎస్’ అని రాయాలని, వ్యతిరేకించినట్లయితే ‘నో’ అని రాయాలని తెలిపారు. అనంతరం వోటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 454 వోల్లు, వ్యతిరేకంగా రెండు వోట్లు లభించాయి. అయితే వోటింగ్కు కొద్దిసేపటి ముందే ప్రధాని నరేంద్ర మోదీ సభలోకి ప్రవేశించారు. అయితే బిల్లును వ్యతిరేకించిన ఇద్దరు సభ్యులు కూడా ఎంఐఎం పార్టీకి చెందినవారు.




