చారిత్రక మహానుభూతి కాల నాళిక…

చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతి ఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని,బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశనపట్టి  విశ్లేషించిన నవల రామాచంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ పరంపరల్ని తడిమి విస్తారంగా విశ్లేషించిన తీరు ఈ నవల చదివే పాఠకులకు మహానుభూతిని కలిగిస్తుంది. వందలాది కన్నీటి జ్ఞాపకాలను అగ్ని చినుకుల్లా కురిపించే సంఘటన క్రమాన్ని కాలనాళికలో చూడొచ్చు. తెలంగాణ ప్రాంతమంతా వేల మంది వీరుల  ఆత్మార్పణలతో అగ్నిగోళమై మండి రక్తకాసారమై పవిత్రతకు ప్రతీకగా మారిన చారిత్రక సందర్భాలను ఈ నవల తేటతెల్లం చేసింది. పరాయి దోపిడీకి శతాబ్దాలుగా గురై అణగారి పోయిన తెలంగాణ జనసామాన్యం కంట నిండా పారిన కన్నీటిని బిగబడుతూనే అలుపెరగక జరిపిన పోరాటాల వివరణ కన్పిస్తుంది. వెట్టిచాకిరి, బానిసత్వం, నిస్సహాయత, నీ బాంచెను దొరా బతుకులు, చిత్ర హింసలతో ఇక్కడి మనుషుల జీవితాలు కన్నీటి చెరువులయ్యాయి. అన్యాయాన్ని ప్రతిఘటించిన  ప్రతి మనిషీ ఒక ఆయుధమై సాయుధుడిగా మారి ప్రత్యక్ష యుద్ధమే చేశాడు. నిరంతర ప్రతిఘటన మధ్య రక్త సిక్తమైన చరిత్ర చిత్రణలో వీరోచిత దృక్కోణాలు ఎన్నో  ఉన్నాయి.

కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడు 1924లో ఢిల్లీ సుల్తాన్‌ ‌మహ్మద్బిన్‌ ‌తుగ్లక్‌ ‌చేతిలో పరాజయం పొందిన తరువాత తెలంగాణ ప్రాంతం పరాయిపాలనలోకి వెళ్లింది. 1324 నుండి 1347 వరకు దాదాపు 23 సంవత్సరాలు ఢిల్లీ సుల్తానులు, 1347 నుండి 1512 వరకు దాదాపు 165 సంవత్సరాలు బహుమనీలు, 1512 నుండి 1667 వరకు 17 సంవత్సరాలు కుతుబ్షాహీలు, 1687 నుండి 1723 వరకు 36 సంవత్సరాలు మొఘల్లు, చివరగా 1724 నుండి 1948 వరకు 224 సంవత్సరాలు అసఫ్‌ ‌జాహి నిజాంలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. మొత్తం 624 సంవత్సరాల సుదీర్ఘకాలం పరాయి పాలన కొనసాగింది. బానిస బతుకులతో అణచివేత, దౌర్జన్యాలు, దోపిడీ, పీడనల మాటున తెలంగాణ చితికిపోగా పోరాటాలు ప్రజ్వరిల్లాయి. కత్తుల వంతెనపై నెత్తురోడిన రీతిలో ఆత్మాంతర గతాన్ని నవల అవలోకించింది. భారత దేశంలోని 565 సంస్థానాలలో అతిపెద్ద సంస్థానంగా ఆనాడు హైద్రాబాదు ఉండేది. నిజాం ప్రభుత్వ ఏలుబడిలో 24,400 చదరపు మైళ్ళ విస్తీర్ణలో 6848 జాగీర్లు ఉన్నాయి. భూములపై పూర్తిగా నిజాం పాలకులకే హక్కులుండేవి. ఇతర జాగిదార్లపై దేశ్ముఖ్లు, జాగీర్దార్లు, జమీన్దార్లు, ముక్తేదార్లు, ఇనాందార్లు అధిపతులుగా ఉండగా జరిగిన వెట్టిచాకిరి, విపరీతమైన
హింసలు, పంటల దోపిడీ, లక్షల ఎకరాల భూ దోపిడీలను, మతమార్పిడీలను, రజాకార్ల దాడులు, ప్రజాప్రతిఘటన పోరాటాలను, అప్పటి ప్రభుత్వ సర్వీసులల్లోని తీవ్ర అసమానతలను ఈ నవల జరిగిన అనేక సంఘటనల ప్రాతిపదికగా విశ్లేషించి చూపింది.

పీడిత ప్రజలను చైతన్య పరిచి తరతరాల బానిస సంకెళ్లను ధ్వంసం చేయడానికి మొట్టమొదటి ప్రజాసంఘంగా ఆంధ్రమహాసభ జరిపిన కృషిని వెల్లడించింది. నిజాం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఆంధ్రమహాసభలను ప్రజల సహకారంతో కమ్యూనిస్టు పార్టీ ముఖ్యనేతలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుండి నిర్వహించి సంఘం పేరుతో నిజాంపై లక్షల మంది సాయుధ జన సైన్యంతో ప్రతిఘటన ప్రారంభించిన  ఉదంతాన్ని దృశ్యమానంగా నవల చూపింది. 1946 నుండి 1951 వరకు ఉద్విగ్నభరితంగా ప్రచండ ప్రభంజనంగా జరిగిన సుదీర్ఘ వీరోచిత సాయుధపోరు ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసింది. అది ఒక అద్భుత పోరాట చరిత్రగా ఈ నవల ఆవిష్కరించింది.
17 సెప్టెంబర్‌ 1948‌న భారత ప్రభుత్వానికి నిజాం లొంగిపోయిన తరువాత తెలంగాణ ప్రజలకు విమోచన కలిగిన విధాన్ని ఆ తదనంతరం 1949 డిసెంబర్‌ ‌తరువాత తెలంగాణ రైతాంగ సాయుధ వీరులైన 3600 మందిని అడవుల్లో గాలించి ఊచకోత కోసిన సంఘటనలను నవల రక్తసిక్త వాస్తవ చరిత్రగా విశ్లేషించింది. పోరాటం ముగిసిన తరువాత ఎన్నో అకృత్యాలకు బాధ్యులైన వారికి శిక్షలు లేకుండా రాజభోగాలు సమకూరిన తీరును, రాజభరణాలు అనుభవించిన స్థితిని నవల పేర్కొంది. ఎన్నో దురాగతాలకు కారణమైన వారు భారతదేశాన్ని విడిచివెళ్లి ఇతర దేశాల్లో  స్థిరపడడాన్ని నవల ఎత్తిచూపింది. 1956 నవంబర్‌ 1‌న ఆంద్రప్రదేశ్‌ ‌రాష్ట్రం అవతరించిన తరువాత తెలంగాణ ప్రయోజనాలకు క్రమంగా జరిగిన భంగపాటును నవలలో వివరంగా పేర్కొన్నారు.

తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టిన ఆనాటి రాజకీయ  దుస్థితిని నవలలో ఎండగట్టారు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి 14 పార్లమెంట్‌ ‌సీట్లకు 10మంది గెలిచిన తరువాత జరిగిన పరిణామాలలో విలువలు పతనమైన తీరును స్పష్టపరిచారు. వరంగల్లు నగరం తెలంగాణ స్థితిగతులకు నిత్య సంచలిత ప్రాంతమై ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడేందుకు దేశవ్యవస్థతో మమేకమైన తీరును వెల్లడించారు. నూతన పారిశ్రామిక విధానం – 1991తో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ పేరుతో జరిగిన నష్టాలను వివరించారు. నిసిగ్గుగా పతనమైన నైతిక విలువలు, పడిపోయిన జీవన ప్రమాణాలు, వ్యష్టి సౌకర్యాల అన్వేషణ వంటి విపరిణామాలతో ఏర్పడిన భ్రాంతిమయ స్థితిని రచయిత వివరించారు. 1991 నుండి విద్యారంగం వ్యాపారంగా మారి విద్యాప్రమాణాలు అడుగంటిన స్థితిని  వెల్లడించారు. నైపుణ్యాలు శూన్యమై హ్యూమెన్‌ ‌గార్బేజ్ను సృష్టిస్తున్న భయానక స్థితిని, మనుషుల్లో అనుచిత ప్రవర్తన, స్వార్థపూరిత ధోరణులు, అవినీతి వంటివి పెరిగిపోవడం వంటి  వాటిని విశ్లేషించారు. కెసిఆర్‌ ‌తెలంగాణ కోసం నడుం భిగించి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరిచి 14 సంవత్సరాల పాటు అవశ్రాంతంగా సబ్బండ ప్రజలను కదిలించి చేసిన పోరాటంలొ 2జూన్‌ 2014‌న తెలంగాణ రాష్ట్రం  ఆవిర్భవించడాన్ని ఒక అపురూప మహత్తర ఘట్టంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న నిర్విరామ అభివృద్ధి పోరాటాన్ని చెబుతూనే దుష్ట సంక్లిష్ట  స్థితులను అధిగమించాల్సిన అవసరాన్ని నవల తెలిపింది. తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి  ఈ నవలకు ఉత్తమ పురస్కారాన్ని అందజేసింది. 1945 నుండి 2017వరకు జరిగిన ప్రతిఘటన చారిత్రాత్మక వరంగల్లు నగరాన్ని కేంద్రబిందువుగా భావించి యావత్‌ ‌తెలంగాణను, దేశాన్ని అవలోకించి మహానుభూతిని కలిగించిన అద్భుత నవలగా  కాలనాళిక మిగిలిపోతుంది.
( కాల నాళికకు తెలుగు విశ్వవిద్యాలయం 2019 నవలా పురస్కారం  లభించిన సందర్భంగా ఈ వ్యాసం…)
                   – తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *