చట్నీలో ఎలుక ఘటనపై మంత్రి దామోదర ఆగ్రహం

జెఎన్‌టియు హాస్టల్‌ ఘటనపై తక్షణం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం
క్యాంపస్‌ వంటగదిని పరిశీలించిన అదనపు కలెక్టర్‌ మాధురి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 9 : చట్నీలో ఎలుక పడిన ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, జిల్లా ఫుడ్‌ సేప్టీ అధికారులను మంత్రి దామోదార రాజనర్సింహ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో చట్నీలో ఎలుక కనిపించిన ఘటన కలకలం రేపింది. దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న హాస్టళ్లు, క్యాంటీన్లను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫుడ్‌ సేప్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహార పదార్థాలను తయారు చేసే నిర్వాహకులు లైసెన్స్‌ తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్‌ సేప్టీ అధికారులు నిరంతరం హోటళ్లు, రెస్టారంట్లతో పాటు బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి దామోదర ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని వంట గదిని పరిశీలించారు. వంటగతి అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపల్‌, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వ్ని ఇంట్లో ఇలాగే ఉంటుందా?’..అంటూ సిబ్బందిని నిలదీశారు.

వెంటనే మెస్‌ కాంట్రాక్టర్‌ను మార్చాలని ఆదేశించారు. వందలాది మంది విద్యార్థులు తినే ఆహారం ఇలా అపరిశుభ్రంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. అంతకు ముందు విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోజూ తినే ఆహారంలో బొద్దింకలు, బల్లులు, ఎలుకలు కనిపిస్తూనే ఉన్నాయని విద్యార్థులు వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలని సిబ్బందికి ఆమె సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *