జాబిల్లి వైపు దూసుకెళ్లిన రాకెట్
ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు
ఇస్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్-3 పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఎల్వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్క్రాప్ట్ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అన్ని దశల్లోనూ ఆ రాకెట్ బూస్టర్లు సక్రమంగా మండాయి. ల్యాండర్, రోవర్తో చంద్రయాన్-3 వెళ్తోంది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు. నిప్పులు చెరుగుతూ రాకెట్ గగనతలంలోకి పయనమైంది. కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్క్రాప్ట్ చంద్రుడి దిశగా వెళ్తున్నట్లు ఇస్రో చీఫ్ చెప్పారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టడంతో ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. దీని బరువు దాదాపు 3,900 కిలోగ్రాములు. స్పేస్క్రాప్ట్ కోసం భూమి నుండి చంద్రునికి ప్రయాణం దాదాపు ఒక నెల పడుతుందని అంచనా వేస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే బాహుబలి రాకేట్ లక్ష్యంగా దూసుకుపోతుంది. చంద్రయాన్-3 సుమారు 3,84,000 కి.వి• ప్రయాణించనుంది. ఆగస్ట్ 23 లేదా 24న చంద్రునిపై సాప్ట్ ల్యాండింగ్ కానుంది. చంద్రయాన్ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయనుంది. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. చంద్రయాన్-3 మిషన్ కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ అభినందనలు తెలిపారు. చంద్రయాన్ ప్రయోగంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు అభినందనలు తెలిపారు. భారత శాస్త్రవేత్తలను అభినందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుండి ఎల్వీఎం3-ఎం4 చంద్రయాన్-3 ను ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సిఎం అన్నారు.




