వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: జిల్లాలో నాలుగు సంవత్సరాల శిక్షణకాలం పూర్తి చేసుకున్న 309 మంది పంచాయతీ సెక్రెటరీలకు పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాలను రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రం పాలనా సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.
పంచాయతీల ఏర్పాటుతో పాటు కార్యనిర్వాక ఉద్యోగుల నియామకం కోసం కొత్తగా 9 వేలకు పైన పంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టడం జరిగిందన్నారు. నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 5 వేల 721 మంది పంచాయతీ కార్యదర్శులలో నేడు 5 వేల 38 మందికి పూర్తి కాలపు ఉద్యోగులుగా నియామక పత్రాలు జారీ చేస్తున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 429 మందిలో 309 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలకులకు పూర్తి కాలపు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు.
నియామక పత్రాలు అందుకున్న పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు
తెలియజేసినారు. విధి నిర్వహణలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా ముందుకు సాగాలని మహేందర్ రెడ్డి సూచించారు. అంతకు ముందు జిల్లాకు నూతనంగా మంజూరైన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఉప కార్యనిర్వాక ఇంజనీరింగ్ కార్యాలయంను మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రజల బాధలను అర్థం చేసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ఉత్తమంగా అందించిన సేవలకు ప్రతిఫలంగా ఈరోజు గ్రామ కార్యదర్శులకు రెగ్యులరైస్ చేయడం జరుగుతుందన్నారు.
తెలంగాణ ప్రజల కోసం తపనపడే ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రెగ్యులర్ అయిన వారందరికీ ప్రభుత్వ నిబంధనలు మేరకు అన్ని సదుపాయాలు లభిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజీత్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, మహేష్ రెడ్డి, రోహిత్ రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభ్రత పటేల్,జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కౌన్సిలర్ అనంతరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఈ ఈ పి ఆర్ శ్రీనివాస్ రెడ్డి, వికారాబాద్ ఆర్డిఓ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.



