- రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో ఆందోళన
- ఘట్కేసర్ ఆందోళనలో పాల్గొన్న మంత్రులు
- బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అన్న హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: గ్యాస్ ధరల పెంపుపై తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ పిలుపు మేరకు పార్టీ నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ ఆందోళనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గ్యాస్ సిలిండర్తో ఊరేగింపులు చేపట్టారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వినూత్నంగా కట్టెల మోపుతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఘట్కేసర్లో బీఆర్ఎస్ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రజలు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం మోసం చేసిందదని విమర్శించారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్యాస్పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు. గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే ఆనాడు బీజేపీ గగ్గోలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి మాటలను మోడీ మరచినా..ప్రజలు మరచిపోలేదన్నారు. మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఉపాధిహా పథకంలో రూ.30 వేల కోట్లు కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఎం కిసాన్ యోజనలో భారీగా లబ్దిదారులను తగ్గించారని వెల్లడించారు. సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి బీజేపీ ప్రభ్తువం పేదల నడ్డి విరుస్తున్నదని చెప్పారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు పెంచడం ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే గ్యాస్పై 10 పైసలు తగ్గిస్తారని, అవి పూర్తవగానే రూ.100 పెంచుతారని దుయ్యబట్టారు. పూర్తి మోసపూరింగా బిజెపి పాలన ఉందన్నారు.
ధరలపై బిఆర్ఎస్ ఆందోళన
వంటావార్పులతో నిరసనలు..ధర్నాలు
పలు జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. కరీంనగర్ పట్టణం తెలంగాణ చౌక్ లో రోడ్లపైనే క్టటెల పొయ్యిలపై వంట వార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెంచిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణెళిశ్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాలుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉన్నాయని అన్నారు. ధర్నా అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.మహబూబాబాద్ పట్టణం నెహ్రూ సెంటర్ లో ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంటవార్పు చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాలోని త్రిపురారం మండల కేంద్రంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ట్రైకర్ చైర్మన్ ఇస్లాత్ రామచంద్రనాయక్, మహిళలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడాన్ని నిరసిస్తూ కేంద్రమైన సంగారెడ్డిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన తెలిపారు. టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




