- మొదటి జాబితాలో 50-55 మంది అభ్యర్థుల ప్రకటన
- త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సీనియర్ నాయకుల బస్సు యాత్ర
- పొత్తుల అంశం హై కమాండ్ చూసుకుంటుంది
- సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 21 : గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, మొదటి దశలో 50-55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం దిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్లో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. అనంతరం మధుయాష్కీతో కలిసి భట్టి వి•డియాతో మాట్లాడుతూ…స్క్రీనింగ్ కమిటీ సమావేశం మధ్యలో ఆగిందని, అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికపై చాలా వరకు చర్చ జరిగిందని చెప్పారు. టికెట్ల కేటాయింపులో సర్వేలు, పార్టీతో అభ్యర్థులకు ఉన్న అనుబంధం రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటామని, కాంగ్రెస్ సిద్దాంతాలతో నడిచే వారిని వదులుకోమని, అదే సమయంలో గెలిచే సత్తా ఉంటే కొత్త వారికి అవకాశం ఇస్తామని భట్టి అన్నారు. టికెట్ రాని వారికి ఏదో విధంగా సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి మొదలు పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. యాత్ర ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
అందులో తాను, రేవంత్, ఇతర సీనియర్ నేతలు పాల్గొంటారని చెప్పారు. లెప్ట్ పార్టీలతో పొత్తు అంశం హైకమాండ్ చూసుకుంటుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యం పాటిస్తామని మధుయాష్కీ అన్నారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో భేటీలో మాణిక్ రావ్ థాక్రే, జిగ్నేష్ మేవానీ, రేవంత్, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు మొదలైన సమావేశం.. దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. అభ్యర్థుల ఎంపిక, బస్సుయాత్ర, ఎన్నికల వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చించారు. అయితే ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో వోటింగ్ జరగడంతో కమిటీ చైర్మన్ కె.మురళీధరన్ అక్కడే ఉండిపోయారు.
ఎంపీలు రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్ వార్ రూమ్లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వోటింగ్కు దూరంగా ఉన్నారని బ్రేకింగ్ రావడంతో, ఉన్నపళంగా సమావేశం మధ్యలో నుంచి పార్లమెంట్కు వెళ్లారు. దీంతో ముఖ్య నేతలు లేని కారణంగా గురువారం మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు, వైఎస్సార్ టీపీ విలీనంపై తనకు ఎలాంటి సమాచారం లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రే తెలిపారు. రేవంత్, భట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జి.వినోద్ ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అనంతరం థాక్రే వి•డియాతో మాట్లాడుతూ.. షర్మిల కాంగ్రెస్ లో చేరే అంశం తన దృష్టికి రాలేదని చెప్పారు.




