- బీజేపీని హెచ్చరించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
- సిబిఐ, ఈడిలను పార్టీ అనుబంధ సంస్థలుగా మార్చుకున్నారని విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : సీబీఐ, ఈడీలను బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా మార్చుకున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందని, అందుకే మూతపడిన తప్పుడు కేసును మళ్లీ తెరిచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, జాతీయ నాయకుడు రాహుల్గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేయించారని ఆయన విమర్శించారు.
శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ రెండుసార్లు ప్రధాని, రాష్ట్రపతి పదవులను అధిరోహించే అవకాశం వొచ్చినా తిరస్కరించిన సోనియా గాంధీని ఈడీ కార్యాలయానికి రావాలంటూ నోటీసులు జారీ చేయడం అవమానించడమేనని అన్నారు. గాంధీ కుటుంబం వి•ద ఈగ వాలినా బీజేపీ నేతల అంతు తేలుస్తామన్నారు. ఈ మేరకు మోదీకి హెచ్చరిక పంపాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు. ఈ నెల 13న అన్ని రాష్ట్రాల ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ నిరసన తెలుపుతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించడం తోపాటు ఈడీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు.
గాంధీ కుటుంబాన్ని ఎవరు అవమానించాలని చూసినా వారి గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటామని హెచ్చరించారు. వొచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు 335 రోజులు కష్టపడితే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పారు. ఇక గ్రేటర్ పరధిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలపై ఈనెల 15 అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్, బీజేపీలను ఆహ్వానిస్తామని తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమం కార్యక్రమంలో మరింత స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


