గరిష్టానికి శబరిమల ఆదాయం

తిరువనంతపురం, జనవరి 19 : కేరళలోని శబరిమల ఆలయం గురించి తెలియని వారుండరు. ఏటేటా ఆయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులు ఒక్కసారైనా వెళ్లాలనుకునే ప్రధాన పుణ్యక్షేత్రం శబరిమల. అందుకే ఏటా కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్‌ అయినప్పటికీ శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి దాదాపు రూ. 320 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్‌కోర్‌ ‌దేవస్వం బోర్డు తెలిపింది. ఈ శుక్రవారం(జనవరి 20)తో వార్షిక తీర్థయాత్ర ముగియనుండడంతో ఆలయ ఆదాయాన్ని ప్రకటించింది ట్రావెన్‌కోర్‌ ‌దేవస్వం బోర్డు. జనవరి 14 నాటికి శబరిమల కొండ ఆలయానికి మునుపెన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయిలో రూ. 320 కోట్ల ఆదాయం అందిందని ఆలయ బోర్డు సీనియర్‌ అధికారి తెలిపారు. ఇక 2018 లో ఆలయానికి ఆదాయంగా వచ్చిన రూ. 260 కోట్లు ఇప్పటివరకూ గరిష్ఠ ఆదాయంగా ఉండేది.

అయితే రెండేళ్ల పాటు వేధించిన మహమ్మారి విరామం తర్వాత పూర్తి స్థాయి తీర్థయాత్రకు అనుమతించింది ట్రావెన్‌కోర్‌ ‌దేవస్వం బోర్డు. ఆ కారణంగానే అన్ని ఆదాయ రికార్డులను, గణాంకాలను బద్దలు కొట్టింది ఈ ఏడాది ఆదాయం. ఈ క్రమంలో ట్రావెన్‌కోర్‌ ‌దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె అనంతగోపాలన్‌ ‌మాట్లాడుతూ.. ‘ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య, ఆదాయం రెండూ చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము ఇంకా లెక్కిస్తూనే ఉన్నాము. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఆదాయం లెక్కలు రానున్నాయి. మకర సంక్రాంతి (జనవరి 14)రోజున 2 లక్షల మందికి పైగా ఆయప్ప భక్తులు ఆలయ సందర్శన చేశారు. వివిధ శాఖలు, యాత్రికుల సహకారంతో అంతా సజావుగా సాగింది. అయ్యప్ప ప్రసాదం నుంచే ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆలయానికి 60 శాతానికి పైగా ఆదాయం సమకూరింద’ని తెలిపారు. కాగా, శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తుల ఆగమనం ఈ ఏడాది ఎక్కువగా ఉండడంతో.. ఆదాయం లెక్కల కోసం టీబీడి ఎక్కువ మంది సిబ్బందిని చేర్చుకోవాల్సి వచ్చింది.

శబరిమల ఆదాయం నుంచే రాష్ట్రంలోని ట్రావెన్‌కోర్‌ ‌ప్రాంతంలోని అనేక చిన్న దేవాలయాలకు, టీబీడీ సిబ్బంది జీతాలను కూడా అందిస్తుంది బోర్డు.అయితే గత నెలలో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని రోజువారీ యాత్రికుల సంఖ్యను 90,000కి పరిమితం చేసింది. కానీ పవిత్ర పర్వదినాలలో ఆ ఆదేశాలను రద్దు చేశారు. ఇక వార్షిక తీర్థయాత్ర సీజన్‌లో(నవంబర్‌ ‌మధ్య నుంచి జనవరి మధ్య వరకు)ఈ ఆలయం రెండు సార్లు తొక్కిసలాట వంటి పరిస్థితులను చూసింది. అంతేకాక ఈ సీజన్‌లో ఆలయ సందర్శన కోసం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు లక్షలాది సంఖ్యలో వస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *