కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూకట్పల్లి నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కూకట్పల్లి నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు అభివృద్ధి చెందారే తప్పా ప్రజల అభివృద్ధిని గాలికొదిలేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. శనివారం నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలని డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 41వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు. అందులో భాగంగానే కెపిహెచ్బి డివిజన్లో పార్కులను, రోడ్లు, డ్రైనేజీలు, ఇండోర్ స్టేడియంల ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామని తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 74 పార్కులను ఇప్పటివరకు అభివృద్ధి చేశామని ప్రతి డివిజన్లో ఇండోర్ స్టేడియాలు, వ్యాయామ శాలలు సైతం ఏర్పాటు చేశామని అన్నారు. అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టాభిషేకం కడతారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.




