- కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు
- నియోజకవర్గ పర్యటనలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్రావు పిలుపు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రానున్న ఎన్నికల్లో గజ్వేల్ నుండి సిఎం కేసీఆర్ను లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపించాలని…లక్ష వోట్ల భారీ మెజారిటీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి కాంకుండా, గజ్వేల్లోనే ఉండాలని కేసీఆర్ను ఒప్పించే పూచీ తనదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 530 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ది పనులను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని, గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో హాజరై మాట్లాడారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రతులు వివిధ వైశ్య సంఘ ప్రతినిధులు మంత్రి హరీష్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సిఎం కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ అనుకున్న దానికంటే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందనీ, లక్ష వోట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. గజ్వేల్లో ఎక్కువ మెజారిటీతో కేసీఆర్ని గెలిపిస్తే కామారెడ్డి నుంచి వద్దు గజ్వేల్లోనే ఉండాలని కేసీఆర్ సారును ఒప్పించే పూచీ తనదని చెప్పారు.
గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతోనే గజ్వేల్కు జిల్లా ప్రభుత్వ దవాఖాన వొచ్చిందనీ, గజ్వేల్ గౌరవాన్ని, ప్రతిష్టను కేసీఆర్ పెంచారని పేర్కొన్నారు. మొన్నటి దాకా గజ్వేల్కు గూడ్స్ రైలు వొచ్చిందని, ఇవాళ్టి(మంగళవారం) నుంచి ప్యాసింజర్ రైలు నడవటం ప్రారంభమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి సిద్ధిపేట జిల్లాకు రైలు తెచ్చుకున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ వొచ్చాక రైతు ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, భూమి విలువ పెరిగిందనీ, గతంలో రైతు ఆత్మహత్యలు చూసేవాళ్లమనీ, సిఎం కేసీఆర్ హయాంలో రైతే రాజు అనే నినాదం నిజం చేశారని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతుల బతుకు దుర్భరమైనవిగా ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఆరేడు వేల మెగావాట్ల కరెంటు ఉంటే..ఇవాళ మూడింతలు పెరిగి 17వేల మెగావాట్ల కరెంటును వాడుతున్నారని తెలిపారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే దమ్మున్న లీడర్ కేసీఆర్ అని, కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా.? కేసీఆర్ మూడు పంటలు కావాలో.. ప్రజలు ఆలోచన చేసి, పనిచేసే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారనీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు.
బండమైలారం గ్రామ రూపు రేఖలు మార్చింది సిఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉచిత హామీలతో వొస్తుంటారనీ, ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గం ఎలా ఉంది..ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నామన్నారు. గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏళ్ల నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారనీ, దేశంలో గజ్వేల్ పేరు, ప్రతిష్ట నిలబెట్టిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను లక్ష వోట్ల మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రాధాకృష్ణశర్మ, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గుండా రంగారెడ్డి, గజ్వేల్ ఆత్మ కమిటీ ఛైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, గజ్వేల్ మునిసిపల్ ఛైర్మన్ నేతి చిన రాజమౌళి, ఎంపిపి దాసరి అమరావతి, ఏఎసిం ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





