హాస్పిటల్ బయట అక్టోబర్ 2న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా గాంధీ విగ్రహావిష్కరణ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ బయట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని అక్టోబర్ 2న సిఎం కెసిఆర్ ఆవిష్కరిస్తారు. విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లు బుధవారం పరిశీలించారు. మంత్రులతో పాటు డీఎంఈ ఎమెష్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్, హాస్పిటల్ సూపరిండెంట్ రాజారావు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..గాంధీ హాస్పిటల్ వద్ద 16 ఫీట్ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషమని అన్నారు. కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ అత్యద్భుత సేవలు అందించిందన్న ఆయన… అక్టోబర్ 2న సీఎం చేతుల మీదుగా ఉదయం10 గంటలకు విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందని వెల్లడించారు.
అనంతరం హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడతారని చెప్పారు. నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంబిస్తున్నారన్నారు. కేసీఆర్ సైతం14 ఏళ్ళు అహింసా మార్గంలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని చెప్పుకొచ్చారు. మహాత్ముడి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ అక్టోబర్ 2 న సికింద్రాబాద్ లో గాంధీకి నివాళులు అర్పిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి వొచ్చి…అక్కడ ఏర్పాటు చేసిన16 అడుగుల మహాత్ముడి విగ్రహం ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ విగ్రహం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్ర తెచ్చిన గాంధీని వదిలి గాడ్సేని కొలుస్తున్న వ్యవస్థను చూస్తున్నామన్న తలసాని… స్వతంత్ర వజ్రోత్సవాల్లో గాంధీ సినిమా ప్రదర్శిస్తే లక్షల మంది వీక్షించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.




