చెన్నై, డిసెంబర్ 22 : చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడంతో కేంద్రం రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్ బుధవారం గుజరాత్లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో కనిపించడంతో కేంద్ర సర్కారు అప్రమత్తమై, రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఎంఏ సుబ్రమణియన్, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని సెక్రటేరియట్లో ఈ సమావేశం జరిగింది. కరోనా నియమ నిబంధనలు, మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అందరూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి ప్రధాన కొవిడ్ నియమాలను తప్పనిసరి చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.



