ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన జీతాలను వెంటనే ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథక యూనియన్ మండల అధ్యక్షురాలు సత్యమ్మ కోరారు. ఆమనగల్లు మండలంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం సమీపంలో చేస్తున్న నివేదిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైనప్పటి నుండి కార్మికులు ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు తమ జీవితాలను పణంగా పెట్టి కట్టెల పొయ్యి పైన పొగకు వంట చేస్తూ ఎన్నో సేవలు చేస్తున్నామని అందువల్ల ప్రభుత్వము తక్షణమే పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెరుగుతున్న నిత్యవసరాల ధరలకు అనుగుణంగా కొత్త మెనును సవరించాలని, మార్కెట్ ధరలకు అనుగుణంగా కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, అవసరమైన వంట గ్యాస్ సబ్సిడీకి ఇవ్వాలని, ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలని రెండు జతల కాటన్ యూనిఫామ్ లు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడం ఆపాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అనంతరం సంఘ సేవకుడు పాపిశెట్టి రాము మధ్యాహ్న భోజన కార్మికులకు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు శంకరమ్మ, ఈశ్వరమ్మ, సుగుణమ్మ, ఆశమ్మ, రాములమ్మ, అలివేలు, గిరిజ, పెంటమ్మ, అనంత, సఫియా బేగం, బేబీ, శాంతమ్మ, యాదమ్మ, ఎల్లమ్మ, లలిత, కాజాబి తదితరులు పాల్గొన్నారు.





