- కనీసం పరామర్శించని కెసిఆర్ కొండగట్టుకు రూ.100 కోట్లు ఎలా ఇస్తారు?
- కొండగట్టు ప్రమాద బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సరామర్శ
కొండగట్టు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : కొండగట్టు ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటే ఆయన ఫ్లేక్సీలకు తాను పాలభిషేకం చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బండి మంగళవారం కొండగట్టు బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను కనీసం పరామర్శించని సీఎం..ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తాననడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి పాదయాత్రను ప్రారంభించిన బండి.. ఘాట్ రోడ్డు వద్ద ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆ దుర్ఘటనలో చనిపోయిన వారి ఫ్లెక్సీలను పరిశీలించారు.
ఆ దుర్ఘటన జరిగినప్పుడు వారు ఎదుర్కున్న ఇబ్బందులను బాధితులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 64 మంది చనిపోతే కనీసం పరామర్శించాలన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారిని పరామర్శించని కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ. 100 కోట్లు ప్రకటిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటికీ ఆర్థికసాయం అందలేదన్నారు. కొండగట్టు వద్ద ప్రమాద నివారణకు చర్యలు శూన్యమని, గోడ నిర్మాణం మినహా ప్రమాద నివారణకు చర్యలేవీ తీసుకోలేదని ఆన్నారు.




