- థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రూ. 15 వేల కోట్ల దోపీడీ
- 24 గంటల ఉచిత విద్యుత్పై రైతు వేదికల్లో చర్చకు సిద్ధం
- ఈ సవాలుకు కేటీఆర్ సిద్ధమా?
- 24 గంటల కరెంట్ సింగిల్ ఫేజ్ అని సీఎండీని ఒప్పుకున్నారు
- ఉచిత విద్యుత్ ముసుగులో కేసీఆర్ అవినీతి
- దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్కు వ్యవసాయం తెలియదు
- రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు నిరసనగా ఎక్కడిక్కకడ కేటీఆర్ను నిలదీయండి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : తెలంగాణలో థర్మల్ పవర్ ఉత్పత్పి ప్లాంట్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ…కేసీఆర్ది 30 శాతం కమీషన్ తీసుకునే సర్కార్ అని ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉందన్నారు. ఉచిత విద్యుత్పై కేటీఆర్ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. కేటీఆర్ ఏ రైతు వేదికకు వొస్తాడో చెబితే తానూ అక్కడికి వొస్తానని..సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్ రైతు వేదికల్లో ఎక్కడికి రావాలో చెప్పాలని, 24 గంటల కరెంటుపై ఆధారాలతో సహా ఇద్దరం చర్చిద్దామని రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. కేటీపీఎస్, యాదాద్రి, భదాద్రి మూడు థర్మల్ ప్రాజెక్టులు కలిపి రూ.45 వేల730 కోట్లకు టెండరు పిలిచారని, ఇందులో 30 శాతం కేసీఆర్ కమీషన్ కొట్టేశారని, ఇది 30 శాతం కమీషన్ సర్కార్…టెండర్లలో రూ.15 వేల కోట్లు నొక్కిన దొంగ కేసీఆర్ అని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుపించారు.
ఉచిత కరెంటును ప్రభుత్వం తన అవినీతికి వాడుకుంటుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ అందిస్తానని చెప్పినా పట్టించుకోకుండా కేసీఆర్ అవినీతి కోసం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారన్నారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను ప్రోత్సహించడం ద్వారా అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచింది కాంగ్రెస్ అని, దేశంలోని లక్ష 5 వేల గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ కరెంట్ అందజేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో కరెంట్ కొరత ఉందని థర్మల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కబుర్లు చెప్పి అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. కేటీపీఎస్ 2015లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రూ.5,280 కోట్లకు టెండర్ పిలిచారని, ఉత్తరాఖండ్ లో 2,400 థర్మల్ పవర్ ఉత్పత్తికి రూ.14వేల కోట్లకు టెండర్ పిలిచిందని, ఒక మెగావాట్ విద్యుత్ రూ.5 కోట్ల 50 లక్షలకు ఉత్పత్తి చేయొచ్చని బీహెచ్ఈఎల్ టెండరు దక్కించుకుందని రేవంత్ తెలిపారు.
తెలంగాణలో ఎన్టీపీసీ 1600 మెగావాట్ల ఉత్పత్తికి రూ.10,997 కోట్లకు టెండరు పిలిచారని, రూ.6 కోట్ల 80 లక్షలకే ఒక మెగావాట్ ఉత్పత్తి చేసేలా టెండరు వేసిందని అన్నారు. ‘‘సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని 2011-12లో చట్టం తెచ్చింది. గుజరాత్ ఇండియా బుల్స్ వద్ద కేసీఆర్, కేటీఆర్ వెయ్యి కోట్లు లంచం తీసుకుని సబ్ క్రిటికల్ టెక్నాలజీని తెచ్చుకున్నారు. దీన్ని రూ.7,290 కోట్లకు బీహెచ్ఈఎల్కు అప్పగించారు…1080 మెగావాట్ల భదాద్రి థర్మల్ ప్రాజెక్టు టెండరు విలువ పెంచి…ఒక మెగావాట్ ఉత్పత్తి చేసేందుకు రూ.9 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి వల్ల కేటీపీఎస్ రూ.945 కోట్లు, భదాద్రి రూ.4,538 కోట్లు, యాదాద్రి రూ.9,384 కోట్ల నష్టం జరిగింది. మూడు ప్రాజెక్టులు కలిపి రూ.45 వేల730 కోట్లకు టెండరు పిలిచారు. ఇందులో 30 శాతం కేసీఆర్ కమీషన్ కొట్టేశారు. ఇది 30 శాతం కమీషన్ సర్కార్. టెండర్లలో రూ.15వేల కోట్లు నొక్కిన దొంగ కేసీఆర్’’ అని థర్మల్ ప్లాంట్ల నిర్మాణం ముసుగులో సాగుతున్న అవినీతిని రేవంత్ రెడ్డి బయటపెట్టారు.
బీహెచ్ఈఎల్ కేవలం ఎలక్ట్రిక్ పనులు మాత్రమే చేస్తుందని, ప్లాంట్ల నిర్మాణంలో సివిల్ పనులు చేయదని, అటువంటి సివిల్ పనులను కేసీఆర్ తన అనుయాయులకు అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు అవినీతి గురించి ప్రశ్నిస్తారనే కేసీఆర్ బీహెచ్ఈఎల్ ను ముందు పెట్టారని ఎద్దేవా చేశారు. బీహెచ్ఈఎల్ నుంచి ఏ ధరకు ఏయే కంపెనీలకు పనులు అప్పగించారో బయటపెట్టాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ను, నన్ను తిట్టకుండా బీఆరెస్ నేతలకు రోజు గడవడం లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆరెస్ బుకాయిస్తూ వొచ్చిందని, కానీ 24 గంటల విద్యుత్ సింగిల్ ఫేజ్ అని సీఎండీ ప్రభాకర్ రావు జనవరి 30న చెప్పిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. ఇవాళ 24 గంటల కరెంటుపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయారని అన్నారు. ‘ఉచిత విద్యుత్ను, ప్రజల సెంటిమెంట్ను స్వార్థం కోసం కేసీఆర్ వాడుకోకూడదని తానా వేదికగా నేను స్పష్టంగా చెప్పాను. దాన్ని తప్పుడు ప్రచారం చేసి రాద్ధాంతం చేస్తున్నారు.
ఉచిత కరెంట్పై పేటెంట్ కాంగ్రెస్ది అయితే.. అసలు కాంగ్రెస్సే కరెంట్ ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడి.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఇలా కేటీఆర్ ఒకటే గంతులేస్తున్నారు. మూడు గంటలు కావాలా..మూడు పంటలు కావాలా అని రచ్చ చేస్తున్నారు. ఆరు పెగ్గులు కావాలా.. లేకుంటే ఫుల్ బాటిల్ కావాలా..? . రైతు వేదికల్లో చర్చ పెడదాం.. కేటీఆర్ ఎక్కడ చర్చ పెట్టినా సరే.. నేను కూడా వస్తాను. ఉచిత కరెంట్ ఇవ్వలేదన్నది నిరూపించాం.. ఇప్పుడు కూడా ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను. మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 3,500 సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్కులను సీజ్ చేసింది. తెల్ల కాగితాలపై రాసుకునే దివాలా పరిస్థితి వొచ్చిందంటే..ప్రభుత్వం కరెంట్ను ఏవిధంగా అవినీతికి వాడుకుంటుందో ప్రజలకు గమనించాలి.
రైతు వేదికల్లో చర్చ జరగాలని పిలుపిచ్చినావో..సిరిసిల్లలో రైతు వేదికకు రావాలా..? సిద్ధిపేటలో చింతమడకలో మీ నాయన కేసీఆర్ పుట్టిన ఊరిలోకి రావాలా..?. సీఎం ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలోని రైతు వేదికకు రావాలో.. విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గానికి రావాలా.. లేకుంటే మంత్రి ఉండే నాగారం గ్రామానికి రావాలా..? కేటీఆర్ స్పష్టంగా చెప్పాలి. మీరు సవాల్ చేశారు.. చర్చ పెట్టమన్నారు.. చర్చకు మేం రెడీగా ఉన్నాం. సింగిల్ ఫేజ్ మాత్రమే 24 గంటలు ఇస్తున్నారు. విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారు. దొంగ లెక్కలు చూపించి రూ.8 నుంచి 9వేల కోట్లు దోచుకుంటున్నారు.. ఈ డబ్బులు ఎక్కడికెళ్తున్నాయ్..? దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా..? 24 గంటలు పవర్ ఇస్తున్నామని మీరు చెబుతున్నారు.. ఇస్తలేరు అని మేం చెబుతున్నాం.. ఆధారాలతో సహా వస్తాం.. తేల్చుకుందాం’ అని కేటీఆర్కు రేవంత్ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
కేటీఆర్…రాహుల్ గాంధీకి క్లబ్బు, పబ్బు తప్ప వ్యవసాయం తెలియదంటావా? తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వారసుడిపై అంత మాట అంటావా? పగలుకు, రాత్రికి తేడా తెలియని నువ్వు రాహుల్ను విమర్శిస్తావా? అంటూ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు కేటీఆర్కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? దుడ్లు, బుడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్కు వ్యవసాయం తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్పై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ను ఎక్కడికక్కడ అడ్డుకోండని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 24 గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతు వేదికలకు తాళం పెట్టి నిరసన తెలపండి. రుణమాఫీ, పోడు భూముల పట్టాలు, 24 గంటల కరెంటు ఇచ్చే వరకు….బీఆరెస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయండని రేవంత్ రెడ్డి రైతులకు, పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆరెస్ చీకటి మిత్రులని, వారిద్దరిది ఫెవికాల్ బంధమని, కేసీఆర్ నాయకత్వంపై హరీష్ రావుకు విశ్వాసం ఉంటే.. కేసీఆర్ ఈసారి మళ్లీ గజ్వేల్లో పోటీ చేయాలని, సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. కేసీఆర్ పాలనకు ఇదే రెఫరెండం లాంటిదని, మూడోసారి అధికారంలోకి వొస్తామన్న కేసీఆర్కు గజ్వేల్లో పోటీ చేయడానికి భయం ఎందుకు? అని, సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.




