- మరోసారి వోటు వేసి మోసపోతే..గోసపడుతాం
- కాళేశ్వరంతో లక్షల కోట్ల అవినీతి…ధరణితో పేద రైతుల భుములు ఆగం
- సిఎం కేసీఆర్ పాలనపై టిజెఎస్ పార్టీ అధ్యక్షులు కోదండరామ్ ఫైర్
- సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని స్పష్టం
మహబూబాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 15 : కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను ఈ ఎన్నికల ద్వారా పారదోలి ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షలను గౌరవించే కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు అందిస్తున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గంగపుత్ర కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో టిజెఎస్ పార్టీ నాయకులు డోలి సత్యనారాయణ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నాయకులూ మైస శ్రీనివాస్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, అంబటి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా మురళి నాయక్లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రజలు అప్రమత్త్తంగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో వోటు హక్కును డబ్బులతో కొల్లగొట్టి మన హక్కులను కాలరాయడానికి మరోసారి బిఅరెస్ ఎత్తుగడలు వేస్తుందని, ఈసారి మోసపోతే గోసపడుతామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రాజెక్టు రూపకల్పనలోనే భారీ కుంభకోణం దాగి ఉందని, డిజైన్లు తప్పుల తడకలుగా ఉన్నాయని కేంద్ర నీటి సంఘం తేల్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లు, ముఖ్యమంత్రి కుటుంబం బాగుపడ్డారని, ప్రజలకు ఒరిగింది ఏమిలేదన్నారు. ధరణితో పేదరైతుల భూములు గుంజుకున్నారని పట్టాలు లేకుండా సాగుచేసుకుంటున్న రైతులను కాస్తు కాలంలో నుంచి తీసి వేసి అమ్మిన వారి పేరుపైన పట్టాలు పాసుబుక్లు ఇచ్చారని ఆరోపించారు. ధరణిని సమూలమైన మార్పు చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ప్రశ్నించే గొంతుకలను అడ్డుకున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రజా సమస్యలపై పోరాటం చేశామని, కానీ కేసీఆర్ పాలనలో మాత్రం ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తున్నారని ఆవేదన చెందారు. ప్రజలు, విద్యార్థులు, మేథావులు గ్రామగ్రామాన కేసీఆర్ పాలనను నిలదీస్తూ చైతన్యవంతం చేయాలని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు అందించి నిలబడాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రయివేట్ ఉపాధ్యాయ సంఘం నాయకులు పరమాత్మ, చారీ, టి జాక్ నాయకులు గుంజ హన్మంతు గోవర్ధన్, కృష్ణ, వెంకన్న, కరీం వివిధ, కళాశాలల లెక్చరర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




