కేరళ కాంగ్రెస్‌ ‌నేత, మాజీ సిఎం ఉమెన్‌ ‌చాందీ మృతి

  • అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో తుదిశ్వాస
  • రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేరళ ప్రభుత్వం
  • ప్రధాని మోదీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, రాహుల్‌ ‌గాంధీ, తదితరుల సంతాపం

తిరువనంతపురం, జూలై 18 : కాంగ్రెస్‌  ‌పార్టీ సీనియర్‌ ‌నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ ‌చాందీ కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్‌ ‌చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో  బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చాందీ ఊమెన్‌ ‌ఫేస్‌బుక్‌లో పోస్ట్ ‌చేశారు. 1943, అక్టోబర్‌ 31‌న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో ఊమెన్‌ ‌చాందీ జన్మించారు. 1970లో తన 27 ఏండ్ల వయస్సులో పూతుపల్లి నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. మొత్తం 12 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో కే.కరుణాకరన్‌ ‌మంత్రివర్గంలో తొలిసారిగా మంత్రి  బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు, 2011-2016 వరకు రెండుసార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఆయన ఒకే పార్టీలో కొనసాగడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి మృతిపట్ల కేరళ కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు కే. సుధాకరణ్‌ ‌తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని చెప్పారు. ఊమెన్‌ ‌చాందీ గౌరవార్థం మంగళవారం ప్రభుత్వ సెలవు దినంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రొఫెషనల్‌ ‌కాలేజీలకు మంగళవారం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో రెండు రోజులపాటు సంతాప దినాలుగా పాటించాలని ఆదేశించింది. మంగళవారం జరగవలసిన పరీక్షలను మహాత్మా గాంధీ, కేరళ, కాలికట్‌ ‌విశ్వవిద్యాలయాలు రద్దు చేశాయి. పీఎస్‌సీ పరీక్ష యథావిథిగా జరుగుతుంది. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ ‌చాందీ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఆయన గౌరవప్రదమైన, అంకితభావంగల నాయకుడని నివాళులర్పించారు. ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారన్నారు. మోదీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఊమెన్‌ ‌చాందీ మరణించడంతో కేరళ అభివృద్ధి కోసం కృషి చేసిన, ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గౌరవప్రదమైన, అంకితభావంగల నాయకుడిని మనం కోల్పోయామని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రిగా చాందీ, గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా తాను అనేకసార్లు మాట్లాడుకున్నామని గుర్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రిగా ఢిల్లీ వెళ్లిన తర్వాత కూడా తాను ఆయనతో మాట్లాడానని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన మద్దతుదారులకు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే చాందీ మృత దేహానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇక కేరళ శాసన సభలో ప్రతిపక్ష నేత సతీశన్‌ ‌మాట్లాడుతూ, ఊమెన్‌ ‌చాందీ అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం కొట్టాయంలోని పుత్తుపల్లి చర్చిలో జరుగుతాయని తెలిపారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్దివ దేహాన్ని మంగళవారం సచివాలయంలోని దర్బార్‌ ‌హాలులో ఉంచుతామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *