తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
బెంగళూరు, జూన్ 28 : కర్ణాటక రాష్ట్రం హుబ్బలిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్ రాడ్ ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. రైల్వే బ్రిడ్జి ముందు ఈ పిల్లర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాల ఎత్తును హెచ్చరిస్తూ దీన్ని ఏర్పాటు చేశారు. ఆ ఐరన్ పిల్లర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. పిల్లర్ కూలేందుకు కొద్ది క్షణాల ముందు ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లింది.
కొన్ని బైక్ లు, బస్సు అటువైపే వెళుతున్నాయి. ఇంతలో పిల్లర్ కూలిపోతుండటాన్ని గమనించిన వాహనదారులు ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్క క్షణం అటూ ఇటూగా అయినా వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇటీవలే పలు వాహనాలు ఈ ఐరన్ పిల్లర్ను ఢీ కొట్టడంతో అది బలహీనపడిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు నిత్యం రద్దీగా ఉండే ఆ రోడ్డు వాహనాల రాకపోకల సందర్భంగా వైబ్రేషన్ కు పిల్లర్ మరింత బలహీనంగా మారినట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.



