బీజేపీ సమాజాన్ని విభజించే ప్రసంగాలను ఆపాలి
కాంగ్రెస్ రక్షణ దళాలను రాజకీయం చేయవొద్దు
బీజేపీ, కాంగ్రెస్లకు ఈసీ సూచన
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 22 : కులం, సంఘం, భాష, మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం మానుకోవాలని బుధవారం రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల కొరకు భారతదేశ సామాజిక-సాంస్కృతిక వాతావరణానికి హాని కలిగించరాదని సూచించింది. బీజేపీ సమాజాన్ని విభజించే ప్రచార ప్రసంగాలను ఆపాలని కోరింది. ఇక రక్షణ దలాల అంశాన్ని రాజకీయం చేయొద్దని, సాయుధ బలగాల సామాజిక-ఆర్థిక కూర్పుకు సంబంధించి విభజన ప్రకటనలు చేయవద్దని పోల్ ప్యానెల్ కాంగ్రెస్ను కోరింది. తమ స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చు లేదా అమ్మేయవొచ్చుననే తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే ప్రకటనలు చేయకుండా చూసుకోవాలని కాంగ్రెస్ను కోరింది. రెండు పార్టీలు కనీస మర్యాద పాటించాలని, పరిధిని మించి ప్రసంగాలు చేయడం తగదని సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలను పాకిస్తాన్ సానుభూతిపరులని, ఈ పార్టీలు దాని అణుశక్తి హోదాతో దేశాన్ని భయపెడుతున్నాయని ఆరోపించగా, భారత జవాన్లు కూలీలుగా మార్చబడ్డారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అగ్నివీర్ పథకంపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బుధవారం వారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈసీ ఈ రెండు పార్టీలకు సూచనలు జారీ చేసింది.





