గ్యాడ్యుయేషన్ డేలో మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16 : కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా సనత్ నగరలోని ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సేవలు అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కాలేజీ నా పార్లమెంటు పరిధిలో ఉన్న సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కార్మిక ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగామగంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ తొలి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ డే ఉత్సవాలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్, రామేశ్వర్, కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సునీల్ సబర్వాల్, ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ ముఖ్మీత్ భాటియా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ తొలి బ్యాచ్ ఎంబీబీఎస్ గ్రాడ్యువేషన్ డే ఉత్సవాలకు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈఎస్ఐసీ సనత్ నగర్ వైద్య కళాశాల నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి మొదటి పట్టా అందుకొంటున్న వారు కరోనా సమయంలో కీలకంగా సేవలు అందించారని కొనియాడారు. వైద్య విద్యార్థులతోపాటు మొత్తం వైద్య సిబ్బంది కరోనా కష్టకాలంలో అందించిన సేవలు చాలా విలువైనవని అన్నారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 80 లక్షల మందికి ఈఎస్ఐ సేవలు అందిస్తున్నామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈఎస్ఐమెడికల్ కాలేజీ, హాస్పిటల్ నూతన పరిశోధనలు అందిస్తుందని, ముఖ్యంగా కొరోనా క్లిష్ట సమయంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.


