- మెజార్టీ రికార్డు బద్దలు కొట్టాలి
- రేవంత్ గెలిచాక బిజెపిలోకి జంప్ ఖాయం
- కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రజలు నమ్మరు
- కామారెడ్డి పర్యటనలో మంత్రి కెటిఆర్
కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కామారెడ్డితో ఉన్న అనుబంధంతోనే కెసిఆర్ ఇక్కడ పోటీకి దిగారని అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ వి•డియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. 2001లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం గెలుచుకున్నాం. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ షబ్బీర్ అలీ కామారెడ్డి సీటు తీసుకున్నారు. నాడు షబ్బీర్ అలీ బతిమిలాడితేనే కేసీఆర్ ప్రచారానికి వొచ్చారు. కామారెడ్డితో కేసీఆర్కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బీబీపేట మండలంలోని పోసానిపల్లి మా నానమ్మ ఊరు. గంపగోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ ఇక్కడ పోటీకి సిద్ధమయ్యారు. నెర్రెలు బారిన, నెత్తురు పారిన ఈ నేల సస్యశ్యామలం కావాలని కేసీఆర్ ఇక్కడ పోటీకి చేయబోతున్నారు. కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.
కేసీఆర్ పేరు ప్రకటించిన మరుక్షణమే గెలుపు ఖరారైంది. ఎమ్మెల్యే టికెట్లు రాని కులాల వారికి నామినేటెడ్ పదవులు కల్పిస్తాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది మా సిద్ధాంతం. తెలంగాణలో గెలవగానే మహారాష్ట్రలో గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నాం. దమ్మున్న నాయకుడు కావాలని మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. కామారెడ్డిలో మెజార్టీ రికార్డు బద్దలు కొట్టాలి.. దేశం నివ్వెర పోయి చూడాలి. మన పంచాయతీలు పక్కన పెట్టాలి.. అందరూ ఒక్కటి కావాలి.. పాత పగలను పట్టించుకోవద్దు. కామారెడ్డి మేనిఫెస్టో ప్రత్యేకంగా తయారు చేస్తాం. వి•రు కోరినవన్నీ తీరుస్తాం. కాంగ్రెస్, బీజేపీ నేతలను తక్కువ అంచనా వేయద్దు. కాంగ్రెస్ నేతలకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తాయి. అదానీ పంపే డబ్బులు మోదీ దగ్గర బాగా ఉన్నాయి. బీజేపీది ఉత్త మేకప్.. కాంగ్రెస్ పాకప్. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి తెలంగాణాకు తీరని ద్రోహం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వేగాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాడు నోటుకు ఓటు.. ఇప్పుడు సీటుకు రేటు. మేము ఎవ్వరికీ బీ టీమ్ కాదు.. ఆ ఖర్మ మాకు పట్టలేదు. ఆరు గ్యారంటీలని ప్రజలె నమ్మరు‘ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల అవకాశమిస్తే ఏమి చేయని వారు, ఇప్పుడు మేం అది చేస్తాం… ఇది చేస్తామని మరోసారి మోసానికి తెరలేపుతున్నారని విమర్శించారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మకుండా.. మోసం చేసిన కాంగ్రెస్ను మోసం చేసి ఓడించాలన్నారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని నమ్మి మోసపోవద్దన్నారు. 50 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో 70 లక్షల మందికి రూ.73వేల కోట్ల రైతుబంధు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. వానాకాలం, ఎండాకాలం సాగుకాలం ఆరంభంలో ప్రతీ రైలు సెల్ఫోన్లో టింగ్ టింగుమంటూ రైతు బంధు వారి ఖాతాల్లో జమవుతోందన్నారు. రూ.43వేల కోట్లతో ఇంటింటికి తాగునీరందంచిన కేసీఆర్నే ప్రజలు నమ్మాలని కోరారు.
బీఆర్ఎస్ ఎవ్వరికీ ’బీ’ కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల ’ఏ’ టీంగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో అనేక మంది వచ్చి పోతుంటారని ఎవ్వరిని నమ్మవద్దని కేటీఆర్ ప్రజలను కోరారు. ఇప్పటి వరకు తమకు అన్ని ఇచ్చింది కేసీఆరే అని ఇంకా ఇచ్చేది కేసీఆరే అని చెప్పండని ప్రజలను ఆయన కోరారు. పదేళ్లలో కేసీఆర్ అన్నీ ఇచ్చారని, ఇంకా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రజలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట శుభవార్త వింటారని వెల్లడించారు. అల్లాటప్పా నాయకులు వచ్చి అన్నీ చేస్తామని మరోసారి మోసం చేసే ప్రమాదముందని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలను కేటీఆర్ కోరారు.





