- ఆరు గ్యారంటీలేమో కాని…ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి ఖాయం
- ‘పాలమూరు-రంగారెడ్డి ద్వారా మొదటగా కుల్కచర్లకు సాగునీరు
- నేడు పంచామతీలుగా తండాలు..పోడు భూములకు పట్టాలు
- మళ్లీ అధికారంలోకి రాగానే వికారాబాద్లోకి గండ్వీడ్, మహ్మదాబాద్ మండలాలు
- కుల్కచర్ల రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
కుల్కచర్ల , ప్రజాతంత్ర, నవంబర్ 13 : ఎన్నికల వేళ హడావుడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తే రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటుందని, ఆరు గ్యారెంటీ పథకాలు ఎమో కానీ…ఆరు నెలలకు ఒకసారి సీఎం మారడం మాత్రం గ్యారెంటీ అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికలంటే ఆగం కావొద్దు..ఆలోచించి వోటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కుల్కచర్ల మండల కేంద్రం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ కావాలో..కరెంటు కావాలో ఆలోచించుకోవాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ముందుగా కుల్కచర్ల మండలానికి సాగునీరు వస్తుందన్నారు. తాను ప్రజల్ని ఒకటే కోరుతున్నానని..నిదానంగా మంచి చెడు ఆలోచించాలని సూచించారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని మరో మారు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధికారంలోకి వొచ్చిన వెంటనే మరో 4 కొత్త పథకాలు తీసుకు వొస్తామన్నారు.
రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు ప్రభుత్వ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచామని, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని, పోడు భూములకు పట్టాలిచ్చామని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగా ప్రతి తండాలో సేవాలాల్ భవనం, మహిళా భవనాలు నిర్మిస్తామని అన్నారు. ప్రజల డిమాండ్ మేరకు గండ్వీడ్, మహ్మదాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో కలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్, అనిల్ రెడ్డి, ప్రతిమా రెడ్డి, దీప్తి రెడ్డి, ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్ , జెడ్పీటీసీ రాందాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, కుల్కచర్ల , చౌడపూర్ మండలాల అధ్యక్షులు సేరి రాం రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగేందర్ గౌడ్, నాగిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




