గురువారం గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో విడుదల చేసిన భూమి డిక్లరేషన్లోని అంశాలు :
1. ధరణిలో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ-వ్యవస్థను రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త కంప్యూటర్ రికార్డును రూపొందిస్తాం. ఇప్పుడున్న రికార్డు సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం.
2. నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
3. అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
4. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశంలోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హామీ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
5. వందకుపైగా ఉన్న భూ చట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
6. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
7. కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
8. 2006లో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
9. కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తాం. రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చెయ్యడానికి రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తాం.
10. భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ నుండి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
11. భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం.




