ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆమనగల్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుస్థిర ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని విశ్వసించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కెసిఆర్ అరాచక పాలనకు త్వరలో చరమ గీతం తప్పదు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఎనబై స్థానాలు గెలుచుకొని అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు, గృహలక్ష్మి, బిసి బందు, మైనార్టీ బందు ఇవ్వలేక కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబ అవినీతి అరాచకాలకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారన్నారు. ఈనెల 31న కొల్లాపూర్ పాలమూరులో ప్రజాభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు, ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వస్పుల మాన్నయ్య, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వి. శ్రీకాంత్, జిల్లా నాయకుడు మధుసూదన్ రెడ్డి, వస్పుల శ్రీశైలం, ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఫరీద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ కు వణుకు : టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి




