మేడ్చల్ ప్రజాతంత్ర అక్టోబర్ 18 : మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి వారి కుమారుడు జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి లు బుధవారం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రతాపసింగారంలోని ఆయన ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, కానీ ఎన్నడూ కూడా ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసిన మంత్రి మల్లారెడ్డిని తరమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లుగా సుధీర్ రెడ్డి ప్రకటించారు. ఇంత తక్కువ టైమ్ లో తనతో వచ్చిన నాయకులు, కార్యకర్తలకు సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలను మేడ్చల్ కు తీసుకువచ్చి ఐటీ హబ్ గా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మెట్రోరైలును మేడ్చల్ వరకు విస్తరింపజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ లో ఎవరు సీఎంగా ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించే స్థానాన్ని తానే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. సుధీర్ రెడ్డి సేవలను తమ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్ లకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి




