కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి తదితరులు

  • కండువా కప్పి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే
  • పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌

న్యూ దిల్లీ, ఆగస్ట్ 3 : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ల సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకోగా జూపల్లి సహా కూచుకుల్ల రాజేశ్‌ ‌రెడ్డి, వనపర్తి నేత మెగారెడ్డి, మాజీ శాసనసభ్యులు గుర్నాథ్‌ ‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లా నేతలకు ఖర్గే కాంగ్రెస్‌ ‌కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఏఐసీసీ జనరల్‌ ‌సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఇం‌చార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సంపత్‌ ‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌చేరిక పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు, అప్పుడూ అంటూ గత రెండు నెలల నుంచి వాయిదా పడుతూనే వొస్తుంది. చివరకు గత నెలలో మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి జూపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని పార్టీ వర్గాలు భావించాయి. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వొస్తారని తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలు ప్రచారం కూడా నిర్వహించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ సభ కూడా వాయిదా పడిపోయింది. దీంతో బుధవారం జూపల్లి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో జూపల్లి సహా మిగిలిన నేతలంతా మంగళవారం సాయంత్రమే దిల్లీకి చేరుకున్నారు. అయితే మల్లి కార్జున కర్గే బిజీగా ఉండడడంతో చివరకు అనివార్య కారణాల వల్ల జూపల్లి చేరిక వాయిదా పడినట్లు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి వెల్లడించారు. కొల్లాపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ పార్టీ వర్గాలు తెలియజేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *