- దేశాభివృద్ధికి బాటలు వేసిన పార్టీ
- మధిర పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన భట్టి
ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశానికి స్వాతంత్రం వొచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 138వ పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మధిరలో కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్య సంబరాలను నిర్వహించారు. మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. దేశ స్వాతంత్రంతో పాటు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను తొలగించటానికి పోరాటం చేసి సాధించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి డాక్టర్.బి. ఆర్.అంబేద్కర్ ఆధ్వర్యంలో రాత పూర్వకంగా రాజ్యంగాన్ని రూపొందించిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భారత రాజ్యాంగం వల్ల దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడంతో పాటు ఎలాంటి హింస ఇబ్బంది లేకుండా సహజసిద్ధంగా అధికార మార్పిడి జరుగుతున్నదని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటమే ఇందుకు కారణం అన్నారు. భారతదేశంతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పటిష్టంగా లేకపోవడంతో ఎన్నికలలో గెలిచిన ప్రభుత్వాలను అక్కడ ఆర్మీ కూలదోస్తున్నదన్నారు. అనేకమార్లు ఆ దేశ అధ్యక్షులను అరెస్టులు చేసి నిర్బంధించడం ఉరి తీయడం, కాల్చి చంపడం లాంటి దుర్ఘటనలకు అక్కడి ప్రజాస్వామ్యం రాజ్యాంగం పటిష్టంగా లేకపోవడమేనని అన్నారు. సమాజంలో చర్చలు, శాంతియుత భావం ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి, అలాంటి మార్గాలను చూపెట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. బారతదేశంలో నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించని ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.
గణతంత్ర, స్వాతంత్ర, లౌకికవాద, సామ్యవాద, సర్వసత్తాక భారతదేశాన్ని రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకుని ఫెడరల్ స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగించిందని అన్నారు. అనేక మతాలు, కులాలు, రాష్ట్రలుగా ఉన్న ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరు కలిసి కట్టుగా ఉండే జీవన విధానాన్ని నిర్మించిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ప్రపంచంలో యుద్దాలు చేసుకుంటున్న దేశాలు మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గం, గాంధేయవాదం, శాంతి వైపు చూస్తున్నాయని అందుకు మనమంతా గర్వపడాలన్నారు. మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస సిద్దాంతంతోనే నేడు దేశాల మధ్య జరిగే యుద్దాలు శాంతియుతంగా పరిష్కారం అవుతున్నాయి. పేదలు అభివృద్ధి చెందటమే కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతం. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాలు, ప్లానింగ్ కమిషన్ తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేసిందని భట్టిగుర్తు చేశారు.



