కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కార్యకర్తల, ప్రజాభిమానం కోల్పోయారు
ఆమనగల్లు బిఆర్ఎస్ ఎంపీపీ నేనావత్ అనిత విజయ్
ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై రోజురోజుకు ప్రజాధరణ కోల్పోతున్నారని సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ ను మార్చాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పావుల కదుపుతున్నారు. గురువారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయం లో విలేకరుల తో ఎంపీపీ అనిత మాట్లాడుతూ ప్రజల నిర్ణయం మేరకు కల్వకుర్తి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని ఆమె అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోనీ ఆమనగల్లు మండలం.. మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఇక్కడి ప్రజలు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. ఆమనగల్ మండలంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. సర్వేల ఆధారంగా ఎమ్మెల్యే టికెట్ ను గెలిచే అభ్యర్థుల కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే కల్వకుర్తి మాత్రం వెనుకబడి ఉందని ఆమె ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ లపై అవిశ్వాసాలు పెడుతూ వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందుల గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీపై ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానంతో పార్టీకి నష్టం కలగకుండా అధిష్టానానికి పై సూచనలు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అధిక జనాభా ఉన్న గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆమనగల్లు మండల కేంద్రంలో గిరిజన భవనాన్ని మంజూరు చేసిన అది శిలాఫలకానికే పరిమితమైందన్నారు. మేడిగడ్డ – శంకర్ కొండ గ్రామాల మధ్యన ఉన్న కత్వా వాగు పై వంతెన నిర్మాణం పనులు ప్రారంభంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. మేము పార్టీకి విధేయులమని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వ్యతిరేకులమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు జేఏసీ చైర్మన్ అవ్వారి శివలింగం, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు తాళ్ల రవీందర్, తెలంగాణ ఉద్యమకారుడు పూసల పరమేష్ చుక్క వెంకటయ్య గౌడ్, కృష్ణారెడ్డి, శేఖర్, నరేష్, మెకానిక్ బాబా, ప్రభాకర్, విజయ్ రాథోడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



