- హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పని చేస్తున్నా
- రాష్ట్రంలో ఉద్యోగులకు సమాయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితి
- కెసిఆర్కు మళ్లీ అధికారమిస్తే ప్రజల నెత్తిన ఇంకో 5 లక్షల అప్పు
- రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం
- కరీంనగర్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో సిఎం కెసిఆర్పై రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ ఫైర్
కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : కరీంనగర్ నగర్ గడ్డపై గర్జించి, గాండ్రిస్తే…బిఆర్ఎస్ వాళ్లకు వణుకు పుట్టాలని రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ అన్నారు. నిన్ననే దిల్లీలో కార్యాలయం ఓపెన్ చేసినోళ్ళకి మనమేంటో కూడా తెలియాలని, కరీంనగర్ సభకు పెద్ద సంఖ్యలో వొచ్చిన ప్రజలకు తాను రెండు చేతులు జోడించి, ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. కరీంనగర్ గడ్డలో పౌరుషం, ఆవేశం ఉందని, తాను ఇక్కడే పెరిగానని, దుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం తోనే తాను బతికినకనని. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని అన్నారు. శుక్రవారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో జరిగిన 5వ విడుత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బండి సంజయ్ మాట్లాడుతూ…తాను మొదటగా ఈ డివిజన్ కార్పొరేటర్నని, 2014లో తనకు ఎమ్మెల్యేగా 52 వేలకుపైగా వోట్లు ఇచ్చారన్నారు. కరీంనగర్ గడ్డ తనను ధర్మం కోసం పనిచేయమందని, ఆ హిందూ ధర్మ రక్షణ కోసమే ప్రజలు గర్వపడేలా పనిచేస్తున్నానన్నారు.
ఆ తర్వాత 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు 68 వేల వోట్లు వొచ్చాయని, అయినా తాను ఎందుకు ఒడిపోయానో ప్రజలకు తెలుసునన్నారు. ఇంకొకరికి కొమ్ముకాసే అలవాటు తనకుకు లేదని, ధర్మానికి, సమాజానికి తలదించే పని తాను ఎప్పటికీ చేయనని అన్నారు. ఆనాడు బండి సంజయ్ ఓడిపోతే… కార్యకర్తలు ఏడుస్తున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, ఆ తర్వాత ప్రజల కష్టార్జిత ఫలితమే తాను కరీంనగర్ ఎంపీగా గెలిచానని బండి సంజయ్ తెలిపారు. ప్రజల వల్లనే కరీంనగర్లో పింక్ కలర్ జెండాను బొందపెట్టి, కాషాయ జెండాను రెపరెపలాడించామని, కరీంనగర్ గడ్డపై, ఎంపీగా లక్ష వోట్ల మెజారిటీతో తనను గెలిపించారని, కార్యకర్తల కష్టం, ప్రజల అభిమానంతోనే తాను గెలిచానన్నారు. ఏ లక్ష్యంతో బిజెపి అధిష్టానం తనను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందో… దానికి అనుగుణంగానే తాను పనిచేస్తున్నానని, కార్యకర్తలతో కలిసి తిరగాలని జాతీయ నాయకత్వం ఆదేశిస్తే…తాను పాదయాత్ర చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో పచ్చ జెండాను బొందపెట్టి, పింక్ జెండాను పీకేసి, కాషాయ జెండా ఎగరేయాలన్నారు.
2001లో సింహగర్జన పేరుతో టిఆర్ఎస్ పెట్టిన సభకు కూడా ఇంతమంది రాలేదని, సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసిండని, రాష్ట్రంతో బంధం తొలగించుకున్నడని, కేసీఆర్ పీడ విరగడయిందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. కేసీఆర్ తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడని బిఆర్ఎస్ పేరుతో ఇప్పుడు దేశాన్ని దోచుకుందామని చూస్తున్నాడని, దందాలు, కబ్జాల పేరుతో… లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నడని తీవ్రంగా విమరి&:చారు బండి సంజయ్. లిక్కర్, స్యాండ్, గ్రానైట్, డ్రగ్స్…ఇలా అన్ని దందాలు, స్కామ్లు వాళ్ళవేనని, రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదని, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదని, 24 గంటలు మోడీని తిడుతూ…ఏపీతో కుమ్మక్కై, సెంటిమెంట్ రగిల్చి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు కలిసి దోచుకోవాలని చూస్తున్నారన్నారు.
కెసిఆర్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని, ఇక్కడ ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వొచ్చాయని ఆయన ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వొస్తే… నిలువ నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. 8 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కేవలం 3 లక్షలేనని, కేసీఆర్ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడని ప్రశ్నించారు. తాజాగా 1.46 వేల ఉద్యోగాలు కేంద్ర సర్కారీ నౌకర్లు మోడీ ఇచ్చారని అన్నారు. కెసిఆర్ విద్యా వ్యవస్థను నాశనం చేసిండని, కనీస సౌకర్యాలు, సిబ్బంది లేరని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం కావాల్నా..వొద్దా అని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండని, మరోసారి కేసీఆర్ కు అధికారం ఇస్తే… ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేసిండా అని ప్రశించారు. పాదయాత్ర ద్వారానే.. 8 సంవత్సరాలు ఫార్మ్ హౌజ్లో పండుకున్న కేసీఆర్… బీజేపీకి భయపడి, బయటికొచ్చిండని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ పార్టీ దుకాణం మూసేసి, దిల్లీలో బిఆర్ఎస్ దుకాణం తెరిచిండని, బిఆర్ఎస్ అంటే…బందిపోట్ల రాష్ట్ర సమితి, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అని విమర్శించారు. గుంటనక్కలు అంతా ఏకమయ్యాయని, మోడీ సింహమని, సింగిల్ గానే వొస్తారని అన్నారు బండి సంజయ్.




