‘‌కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి

  • ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ
  • పంచాయతీ, మున్సిపల్‌ ‌శాఖలతో సమన్వయం చేసుకోవాలి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్లతో ఆర్థిక, అరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష
జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జనవరి 18  నుంచి నిర్వహించే రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారులతో మంత్రి హరీష్‌రావు వీడియోకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులందరిని ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు.

ప్రజలకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొనాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని చెప్పారు. సీరియస్‌గా తీసుకొని పని చేయాలన్నారు. జిల్లాల్లో ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్‌ ‌డేస్‌లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్‌లు పెంచామన్నారు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్‌ ‌గ్లాసెస్‌, 25 ‌లక్షల పిస్క్రిషన్‌ ‌గ్లాసెస్‌ ఉం‌టాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయడం పూర్తి చేయాలన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో పిస్క్రిప్షన్‌ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్‌ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏ కార్యక్రమం అయినా రూపొందిస్తారని, ప్రజల కోణంలో ఆలోచిస్తారని చెప్పారు. ప్రభుత్వం పరంగా అన్ని చేస్తామని, అధికారులు పూర్తి బాధ్యతతో పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసింది అన్నారు. రోజు వారీ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్‌, ‌పంచాయితీ రాజ్‌ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్‌ ‌చేసుకోవాలన్నారు. మండల, జిల్లా, పురపాలక సంఘం మీటింగ్‌లలో కంటి వెలుగుపై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు.

జిల్లాలో మైక్రో ప్లానింగ్‌ ‌పూర్తి అయిన తర్వాత జిల్లా ఇంఛార్జి మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా వారీగా మీటింగ్‌ ఏర్పాటు చేయాలనీ, ఏ రోజు ఎక్కడ క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్లాన్‌ ‌చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 5 శాతం బఫర్‌ ‌టీమ్‌( అడ్వాన్స్ ‌టీమ్‌)‌లు పెట్టుకోవాలన్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు చేసుకోవడం మిస్‌ అయిన వారి కోసం కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలన్నారు. స్టేట్‌ ‌లెవెల్‌ 10 ‌క్వాలిటీ కంట్రోల్‌ ‌టీమ్‌, ‌జిల్లాకొక క్వాలిటీ కంట్రోల్‌ ‌టీమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీరు ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారన్నారు. 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నామన్నరు. ఎలాంటి వైద్య సిబ్బంది కొరత లేదన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.

ప్రభుత్వం తరుపున అన్ని విధాలా పూర్తి స్థాయి సహకారం ఉంటుంది. కానీ ఎఫెక్టివ్‌గా జరిగేందుకు అందరం కలిసి కృషి చేయాలన్నారు. కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో సీఎం ఉన్నారని దానిని నెరవేర్చడంలో మనందరిది ముఖ్య పాత్ర అన్నారు. గిన్నీస్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్‌లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దామన్నారు. ప్రాథమిక వైద్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు గాను, పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి చేస్తున్న సబ్‌ ‌సెంటర్లు, పీహెచ్‌సీల కొత్త నిర్మాణాలు, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జగిత్యాల కలెక్టరెట్‌లో జరిగిన సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ‌శ్వేత, పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ ‌శ్రీనివాస్‌, ‌జిల్లా అదనపు కలెక్టర్‌ ‌మందా మకరంద్‌ ‌పాల్గొనగా, హైదరాబాద్‌ ‌నుండి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *