ఒం‌టరిగా వెళుతున్న యువతిపై కారుతో దాడి

  • యాక్సిడెంట్‌గా చిత్రీకరించే యత్నం
  • సిసి టివి కెమెరాల ఆధారంగా దర్యాప్తు

హైదరాబాద్‌, ‌జూలై 7: నగర శివారు రాజేంద్రనగర్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చింతల్‌మెట్‌? ‌హకీం హిల్స్ ‌వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించారు. యువతిని ఢీకొట్టిన వెంటనే దుండగులు కారులో పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తలకు బలమైన గాయమైందని వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. రోడ్డుప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు సుమియా బేగం(19) టైలరింగ్‌ ‌శిక్షణ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదమా హత్యాయత్నమా అనే కోణంలో ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కారులో ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కుటుంబసభ్యులు కూడా రోడ్డు ప్రమాదంగానే చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు కూడా యువతిని ప్రేమించిన వ్యక్తే హత్యకు యత్నించాడంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *