ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, ఆగస్ట్ 30 : సోలాపూర్ అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు..100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయంలో ప్రతి రాఖీ పౌర్ణమికి రథయాత్ర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ..ఈ రథయాత్రలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సోలాపూర్ మార్కండేయ రథయాత్రలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…మార్కండేయ ఆలయాభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారని తెలిపారు.
మహారాష్ట్ర ప్రజలు కలిసిమెలిసి ఐక్యతను చాటుకోవాలని తాను కోరుతున్నానన్నారు. సోలాపూర్లో బిఅర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం రెండు చోట్ల.. బాల్ కోటి మైదానం మరియు ఈద్గా మైదానాలను మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ పరిశీలించారు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొంటూ ఇతర అన్ని రాష్ట్రాలు తెలంగాణ వలె అభివృద్ధి సాధించాలంటే కెసిఆర్ లాంటి నాయకుడు అవసరమన్నారు. దేశంలో అత్యధిక రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలో ఎందుకు జరుగుతున్నాయని•యన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిపాలకులు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే నిరంతరం ప్రయత్నాలు చేస్తారు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని, తమది మహిళలు, రైతులు, యువతతో కూడుకున్న టీమ్ అని, అధికారం కోసం ఎవరితోనూ పొత్తులు ఉండవని హరీష్ రావు స్పష్టం చేశారు. కెసిఆర్ పోరాటంతో తెలంగాణ సాధించుకుని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించామని మంత్రి తెలిపారు.



