రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అత్యంత అధునాతనంగా తీర్చి దిద్దుతున్నామని, ఎయిర్పోర్టును తలదన్నేలా ఉంటుందని, అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ. 750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది జరుగుతుందని, అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు జరుగుతున్నాయని, మల్టీ లెవల్ పార్కింగ్, విశ్రాంతి గదులు, రూఫ్ టాప్ రైల్వే ట్రాప్ ప్లాట్ ఫారమ్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విూడియాతో మాట్లాడుతూ..చాలా తక్కువ సమయంలో వేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయన్నారు.
ఎయిర్ పోర్ట్ తరహాలో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంటుందని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తున్నారన్నారు. 2025 నవంబర్ నాటికి పూర్తి అవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, అది కూడా త్వరలోనే పూర్తి అవుతుందన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ 22 లిఫ్టులు 30కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులు నేరుగా స్టేషన్లోకి రావడానికి బయటికి వెళ్ళడానికి గగనతలం నుండే ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు.





