- ట్రీట్మెంట్ చేసుకున్నాక చెబుతున్న మాటలు
- కెటిఆర్ సవాళ్లపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21 : డ్రగ్స్పై తాను సవాల్ చేసినప్పుడు స్పందించకుండా..ఇప్పుడా మాట్లాడేది అని మంత్రి కెటిఆర్పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి కేటీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుని వొచ్చి..ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం మంత్రి కేటీఆర్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందిస్తూ..డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని..దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏం తప్పులేకుంటే డ్రగ్స్ కేసును ఎందుకు ఆపేశారని నిలదీశారు.
సీఎం కేసీఆర్ కుటుంబానికి నరనరాన అహంకారం ఉందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల భాష చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. వేములవాడ, ధర్మపురికి ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తీగల గుట్టపల్లి ఆర్వోబీ నిర్లక్ష్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు. గంగాధరకు ఆర్వోబీ మంజూరయ్యిందని..దీని పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హావి•లను అమలు చేయలేదని ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసుల్లో తాను ఎవరి పేరు చెప్పలేదన్నారు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాను తంబాకు తింటున్నట్లు కేటీఆర్ ఆరోపణలు చేసినప్పుడు ఆయన సంస్కారం ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి వొస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని..ఇది సరైన పద్ధతి కాదన్నారు.




