- 24 నుంచి 30 నెలల్లో తొలిదశ పనులు పూర్తి
- స్థానికులకే పూర్తి అవకాశాలు ఉంటాయన్న సిఎం జగన్
కడప, ఫిబ్రవరి 15 : ఆంధ్రుల కల కడప స్టీల్ ప్లాంట్కు ముందడుగు పడింది. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళప్లలెలో జేఎస్డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ.8,800 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. 24 నుంచి 30 నెలల్లో ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తవుతాయని స్థానికులకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఏపీ మూడేళ్లగా నంబర్ 1గా ఉందన్న ఆయన..రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు. భూమి పూజ అనంతరం సీఎం జగన్ శిలాఫలకాలను ఆవిష్కరించి, స్టీల్ ప్లాంట్ నమూనాను పరిశీలించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ లో మౌలిక సదుపాయాలకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ స్టీల్ ప్లాంట్ నిర్మించనుంది.
తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రూ.8,800 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు.ఈ ఫ్యాక్టరీతో చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. మరో 24 నుంచి 30 నెలల్లో మొదటి ఫేజ్ పనులు పూర్తవు తాయని తెలిపారు. స్థానికులకు ఇక్కడే ఉపాధి లభిస్తుందన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపర్చిన సంగతి తెలిసిందే. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేశారు.. కానీ ఆ తర్వాత కరోనా ప్రభావంతో నిర్మాణ పనులు ఆగాయి. 2022 డిసెంబర్ 16న జీవో ఎంఎస్ నంబర్ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జేఎస్డబ్ల్యూ ఈ స్టీల్ ప్లాంట్కు తొలి విడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణానికి సిద్ధమైంది. ఫేజ్?1లో రూ.3,300 కోట్లు.. దాదాపు 30 నెలలకుపైగా నెలల కాలపరిమితిలో ఫేజ్1 పనులు పూర్తి చేస్తారు.
ఫేజ్2లో మరో రూ.5,500 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. 2029 మార్చి 31 నాటికి ఫేజ్-2 పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు మౌలిక వసతులను కల్పిస్తున్నారు. నీటి వసతి, నాలుగులేన్ల రోడ్డు,రైల్వే కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా, కాంపౌండ్ వాల్ ఇలా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. 27 కిలోటర్ల మేరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు.. 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. అంతర్గత రోడ్డు పనులు కూడా పూర్తి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2007లో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. కానీ కొన్ని కోర్టు కేసులతో ఆ పరిశ్రమ ఆగిపోయింది.. 2018లో మైలవరం మండలం కంబాలదిన్నె దగ్గర రాయలసీమ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019లో ముఖ్యమంత్రి జగన్ సున్నపురాళ్లప్లలె వద్ద కొత్తగా మరోసారి శిలాఫలకం వేశారు. స్టీల్ప్లాంట్ కోసం 2019లో శంకుస్థాపన చేసిన చోటే మళ్లీ జగన్ మూడేళ్ల తర్వాత మళ్లీ అదే స్థలంలో మరోసారి భూమి పూజ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


