- కాంగ్రెస్ పార్టీ నేతల ఘన స్వాగతం
- రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు సాగనున్న యాత్ర
- 23న తెలంగాణలోకి..
కర్నూలు: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మంగళవారం ఆంధప్రదేశ్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎపి పిసిసి అధ్యక్షులు సాకె శైలజానథ్ నేతృత్వంలో పార్టీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం నుంచి నాలుగు రోజులు పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీ సరిహద్దు గ్రామమైన హాలహర్వి నుంచి ఉదయం రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. చత్రగుడి హనుమాన్ ఆలయం నుంచి రాహుల్ పాదయాత్ర కొనసాగింది. ఆలూరు సిటీలోకి ప్రవేశించిన అనంతరం రాత్రి చాగి గ్రామంలో బస చేశారు. పాదయాత్రలో ఏపీ నాయకులతోపాటు..ఉత్తమ్కుమార్ రెడ్డి సహా పలువురు తెలంగాణకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. రాహుల్ పాదయాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలం హాలహర్వి వద్ద భారీ ఏర్పాట్లు, పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడోయాత్ర 42 రోజులుగా కొనసాగుతుంది. 21వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు ఏపీలో భారత్ జోడోయాత్ర జరగనుంది. ఆంధప్రదేశ్లో 96 కిలో వి•టర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులంతా ఈ యాత్రలో పాల్గొన్నారు. చాగి నుంచి నేటి ఉదయం 6.30 నిమిషాలకు రాహుల్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు 20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభమై కల్లుదేవకుంట గ్రామం వరకు కొనసాగనుంది. 21న మంత్రాలయం గుడి సర్కిల్ నుంచి మాధవరం బ్రిడ్జి వరకు సాగనుంది.
భారత్ జోడో యాత్ర ఈ నెల 23 ఆదివారం రోజున తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్ చేరుకొని.. దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాదయాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇవ్వనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది. ఆ తర్వాత మళ్లీ 26 నుంచి పాదయాత్ర తెలంగాణలో ప్రారంభం కానుంది. నవంబర్ 1, 2న రాహుల్ హైదరాబాద్లో బస చేయనున్నారు. నవంబర్ 7న కామారెడ్డి జిల్లా మీదుగా యాత్ర మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది.




